అధికారులు బాధ్యతతో పనిచేయాలి
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం మహాజాతరలో జోనల్, సెక్టార్ అధికారులు బాధ్యతతో పనిచేయాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. మేడారం హరిత హోటల్లో జాతర విధుల నిర్వహణపై జోనల్, సెక్టార్ అధికారులకు గురువారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మేడారం జాతర ప్రదేశాలను 12 జోన్లుగా విభజించి 62 మంది జోనల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. అలాగే 51 సెక్టార్లకు 179 మంది అధికారులను కేటాయించినట్లు వివరించారు. జాతర సమయంలో చేపట్టాల్సిన బాధ్యతలు, నిర్వహణ విధానం, ప్రజల భద్రత, రవాణా నియంత్రణ, పారిశుద్ధ్యం, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు స్పష్టమైన అవగాహన కల్పించినట్లు వెల్లడించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రతీ అధికారికి స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన మాన్యువల్ను అందజేశామని వివరించారు. జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను వినియోగించనున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా భక్తుల రద్దీని పర్యవేక్షించడంతో పాటు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు మాస్టర్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తామన్నారు. దీంతో సమస్యలు తలెత్తిన వెంటనే గుర్తించి తక్షణమే పరిష్కరించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జంపన్నవాగు ప్రాంతంలో జన సందోహం ఎక్కువగా ఉంటుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 3 షిఫ్టుల్లో గజ ఈతగాళ్లు సిద్ధంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. వివిధ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ


