యూరియా పంపిణీపై అసహనం
ములుగు రూరల్: యాసంగి సాగుకు సరిగా యూరియా పంపిణీ చేయకపోవడంతో ఓ రైతు అసహనానికి గురై రెండు బస్తాల యూరియాను పెట్రోల్ పోసి తగలపెట్టి నిరసన తెలిపాడు. ఈ ఘటన శనివారం మల్లంపల్లి మండలం దేవనగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 450 యూరియా బస్తాల పంపిణీ చేపట్టారు. గ్రామానికి చెందిన గుడెళ్లి హరీశ్ లైన్లో నిలబడి రెండు బస్తాల యూరియా తీసుకున్నాడు. ప్రస్తుతం మొక్కజొన్నకు యూరియా అవసరం ఉందని తనకు ఇంకా కావాలని అడుగగా లేవని తెలిపారు. దీంతో హరీశ్ అధికార పార్టీ నాయకులు పదుల సంఖ్యలో బస్తాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు. సాధారణ రైతులకు మాత్రం రెండు బస్తాలు ఇస్తున్నారని ఆరోపించారు. దీంతో అసహనికి గురైన హరీశ్ గ్రామంలోనే తను తీసుకున్న యూరియా బస్తాలపై పెట్రోల్పోసి నిప్పు అంటించారు.
సమ్మక్కసాగర్లో రొయ్య పిల్లల విడుదల
కన్నాయిగూడెం: మండల పరిధిలోని తుపాకులగూడెం సమ్మక్కసాగర్ బ్యారేజీలో రొయ్య పిల్లలను శనివారం విడుదల చేశారు. మత్స్యశాఖ అధికారులు సబ్సిడీ రొయ్య పిల్లలను అందించగా పెసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ వాటిని గిరిజన సొసైటీ కమిటీ, సర్పంచ్ పీరీల స్వప్న ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వప్న మాట్లాడుతూ గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం సబ్సిడీపై రొయ్య పిల్లలను అందజేస్తుందని వివరించారు.
హేమాచలక్షేత్రంలో భక్తుల రద్దీ
మంగపేట: మండలంలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయంలో సందడి నెలకొంది. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పాటు మేడారం వెళ్లివచ్చే భక్తులు సైతం స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వులనూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. దర్శించుకున్న భక్తుల గోత్ర నామాలతో అర్చనలు జరిపించి స్వామివారి చరిత్రను వివరించారు.
నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ
వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని గొత్తికోయగూడెం తొర్రిచింతలపాడుకు చెందిన నిరుపేదలకు శనివారం యూత్ ఫర్ సేవా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు దుప్పట్లు, సోలార్ లైట్లు, నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కోటి మాట్లాడారు. చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేయడం మరు వలేనిదన్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి అయిలయ్య, కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.


