భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన
మంగపేట: మండలంలోని బోరునర్సాపురంలో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవంలో భాగంగా భక్తులు భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీ వెంకటేశ్వరస్వామి చిత్రపటం, కలశంతో గోవింద నామస్మరణ చేస్తూ ఆలయం నుంచి ఏటూరునాగారం–బూర్గపాడు ప్రధాన రోడ్డు మీదుగా ఉమాచంద్ర శేఖరస్వామి ఆలయం, పాతనర్సాపురం మీదుగా తిరిగి ఆలయం వరకు నగర సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగర సంకీర్తన చేపట్టిన భక్తులకు గ్రామస్తులు మంగళహారతితో ఎదురేగి బిందెలతో నీల్లారపోసి స్వామివారికి స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న నగరసంకీర్తన భక్తుల బృందం ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామిని ఆరాధిస్తూ భజన చేస్తూ పాటలు పాడారు. ఈ సందర్భంగా ఆలయంలో పూజారి జీడికంటి మధుసూదనాచార్యులు భక్తుల గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆదివారం ఆలయంలో ఉదయం 8 నుంచి స్వామివారికి అభిషేక పూజలు నిర్వహించనున్నట్లు పూజారి మధుసూదనాచార్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, గౌరవ అధ్యక్షుడు దేవకి, కరి వెంకాయమ్మ, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ వెంకటేశ్వర్లు, కోశాధికారి పూసాల సరోజీ, భక్తులు నాగేశ్వర్రావు, కడియాల సుదర్శన్, కొత్త శ్రీనివాస్, గుజ్జుల కోటిరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో నగర సంకీర్తన


