జాతర పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
● కలెక్టర్ టీఎస్.దివాకర
ఎస్ఎస్తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతరకు ముందస్తుగానే అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. మేడారం ఆలయ పరిసరాల్లో చేపట్టిన పునరుద్ధరణ, ల్యాండ్ స్కేపింగ్ పనులను కలెక్టర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో జాప్యం జరగకుండా వేగం పెంచాలన్నారు. నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో చేపట్టిన ల్యాండ్ స్కేపింగ్ సుందరీకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునే విధంగా ఆలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని సూచించారు. పచ్చదనంతో ప్రతిబింబించేలా మొక్కలు నాటడం, నడక మార్గాలను, విశ్రాంతి ప్రదేశాలుగా రూపొందించాలన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రాకారపు రాతి స్తంభాలపై బ్రాకెట్లు, ప్రధాన ఆర్చి రాతి స్తంభాలపై పీటీ బీమ్లు వెంటనే అమర్చాలని ఆదేశించారు. జాతర ప్రారంభానికి ముందుగా అన్ని నిర్మాణాలు, సుందరీకరణ పనులను పూర్తి చేయాలన్నారు. వనదేవతల దర్శనానికి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ ప్రాంగణం, జంపన్నవాగు పరిసరాలు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాల్లో పరిశుభ్రత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మహాజాతరను సజావుగా నిర్వహించడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.


