
నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు
వెంకటాపురం(ఎం)/ములుగు: అర్హులైన పేదలందరికీ పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని, ఈ నెలాఖరులోగా ప్రతీ గ్రామంలో ప్రారంభిస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. భూ భారతి పైలట్ మండలంగా ఎంపిక చేసిన వెంకటాపురం(ఎం) మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు మంత్రులు ధనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖలతో కలిసి ఆయన హాజరయ్యారు. పలువురు రైతులనుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులు అందజేశారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇందిరమ్మ పేరు వింటేనే ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. జిల్లాలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారని, ఈ ప్రాంత సమస్యలపై ప్రత్యేక కమిటీ వేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల్లో రైతు సదస్సులు ఎప్పుడు పెట్టలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి–2020 చట్టాన్ని బంగాళాఖాతంలో వేసి సామాన్య ప్రజల కోసం భూ భారతి–2025 చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. ఈ చట్టం ద్వారా కాస్తులో ఉన్న ప్రతీ రైతుకు పట్టా పాస్ బుక్కులు అందజేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకొని ఉన్న ఆబాదీ భూములకు డాక్యుమెంట్లు అందిస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో పండుగ వాతావరణం
భూ భారతి చట్టంతో రాష్ట్రంలో పండుగ వాతావరణం మొదలైందని, ఈ చట్టంపై అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు అన్నారు. జిల్లా కలెక్టర్లు రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని చట్టంపై రైతులకు అవగాహన పెంచుతూ భూ సమస్యలను తెలుసుకుంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా మంత్రులను, ఎంపీ, ఎమ్మెల్యేలను సీతక్క శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కొంతమంది రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి రశీదులను మంత్రులు శ్రీనివాస్రెడ్డి, సీతక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీఎస్, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణ రావు, కేఆర్.నాగరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్, అదనపు కలెక్టర్ మహేందర్ జీ, ఆర్డీఓ వెంకటేష్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
746 దరఖాస్తులు స్వీకరణ
మండల కేంద్రంలోని హైస్కూల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై దరఖాస్తులు తీసుకునేందుకు 8 కౌంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ భూ సమస్యలపై 746 దరఖాస్తులు వచ్చినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
ధరణితో గోసపడ్డాం..
ధరణి చట్టంతో గోసపడ్డాం.. చెప్పులరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగి అలిసిపోయాం. భూములున్న వారికి పట్టాలు ఇవ్వలేదు. ధరణిలో భూములు ఎక్కించే అవకాశాలు లేవని రెవెన్యూ అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి చట్టంతోనైనా మాకు న్యాయం జరగాలని పలువురు రైతులు అభిప్రాయ పడ్డారు.
● ఎన్నో ఏళ్లుగా భూమిని సాగు చేసుకుంటున్నాం. ధరణి రాకముందు రికార్డుల్లో ఉంది. ధరణి చట్టం వచ్చాక మా భూమిని తొలగించారని వెంకటాపురం(ఎం)కు చెందిన తుత్తురు పర్వతాలు అన్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగిన రికార్డులో ఎక్కలేదని వాపోయారు.
పట్టా లేకపోవడంతో
పథకాలు అందలేదు..
భూములకు పట్టా లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందలేదు. పట్టా చేయాలని తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు తిరిగినా..పట్టా కాలేదు. భర్త చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భూభారతిలోనైనా పట్టా చేసి ఆదుకోవాలి.
– తైనేని సరోజన, వెంకటాపురం(ఎం)
రైతును రాజు చేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ :
మంత్రి కొండా సురేఖ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం రైతుల గురించి ఆలోచించి రైతును రాజుగా చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. వైఎస్సార్ హయాంలో రైతు రుణమాఫీ, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సబ్సిడీపై విత్తనాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా పేదలకు, దళితులకు భూములు పంచారని వెల్లడించారు. సీఎం రేవంత్రెడ్డి రైతులకు న్యాయం చేసేందుకే భూభారతి చట్టాన్ని తీసుకు వచ్చారన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టకుండా అధికారులు సేవలందించాలని, తప్పు చేసే వారిపై చర్యలు ఉంటాయన్నారు.
భూమికి రైతుకు ఉన్న బంధమే తల్లీబిడ్డ సంబంధం:
మంత్రి ధనసరి సీతక్క
తల్లీబిడ్డకు ఎలాంటి సంబంధం ఉంటుందో భూమికి రైతుకు అలాంటి బంధం ఉంటుందని, గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చి రైతుల ఆత్మహత్యలకు కారకులయ్యారని మంత్రి సీతక్క అన్నారు. నేడు రైతుల సమస్యలను పరిష్కరించడానికి సీఎం రేవంత్రెడ్డి భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. నూతన చట్టాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేయాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపారాలు చేయడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పార్టీలకతీతంగా ప్రతీ నిరుపేదకు లబ్ధి
సామాన్య ప్రజల కోసమే ‘భూ భారతి’
గిరిజన ప్రాంత సమస్యలపై
కమిటీ ఏర్పాటు
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
భూ భారతి పైలట్ మండలంలో రెవెన్యూ సదస్సు
హాజరైన మంత్రులు ధనసరి సీతక్క, కొండా సురేఖ తదితరులు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు

నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్లు