
వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'వన్ వే టికెట్'. ఈ సినిమాకు ఏ. పళని స్వామి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ పద్మ ఫిల్మ్స్, రంగస్థలం మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీకి జొరిగే శ్రీనివాసరావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ సరసన కుష్బూ చౌదరి కనిపించనుంది.
తాజాగా ఈ మూవీ గ్రాండ్గా ప్రారంభమైంది. హైదరాబాద్లో జరిగిన పూజా కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా.. హర్షిత్ రెడ్డి స్క్రిప్ట్ అందజేశారు. దర్శక, నిర్మాత త్రినాధరావు నక్కిన తొలి సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
నక్కిన త్రినాధరావు మాట్లాడుతూ .. ‘మా వరుణ్ సందేశ్ చిత్ర ప్రారంభోత్సవానికి రావడం నాకు ఆనందంగా ఉంది. వరుణ్ సందేశ్ వైభోగం ఒకప్పుడు నేను చాలా చూశా. మా డార్లింగ్ వరుణ్ సందేశ్కు ఓ హిట్ అవ్వాలన్నదే నా కల. ఈ ‘టికెట్’ మూవీ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
వరుణ్ సందేశ్ మాట్లాడుతూ .. 'వన్ వే టికెట్ టైటిల్ విన్న వెంటనే నాకు కొత్తగా అనిపించింది. పళని చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఇందులో కొత్త పాత్రను పోషించబోతోన్నాను. ఈ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మా సినిమాకు కార్తీక్ మంచి మెలోడీస్ ఇవ్వబోతోన్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నాం' అని అన్నారు. ఈ వన్ వే టికెట్ మూలీ క్రైమ్ థ్రిల్లర్గా ఉంటుందని దర్శకుడు పళని స్వామి తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో మనోజ్ నందం, సుధాకర్, రామ్ తిరుపతి ముఖ్య పాత్రల్ని పోషించనున్నారు. ఈ మూవీకి సంగీత దర్శకుడిగా కార్తిక్ పనిచేస్తున్నారు.