ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి. ప్రకాశ్ రాజ్, ప్రియమణి, రాధిక, నాజర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో వరలక్ష్మి సైతం కీలక పాత్ర పోషించింది. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వరలక్ష్మి భావోద్వేగానికి లోనైంది.
నన్ను క్షమించండి
ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమాకు దర్శకత్వం వహించడం వల్ల నా గొంతు పోయింది. అందుకు నన్ను క్షమించండి. మేము ఒక మంచి సినిమా తీశాం. మీరు ఇచ్చిన సపోర్ట్ వల్లే నేను ఇన్నిరోజులుగా ఇండస్ట్రీలో బతుకుతున్నాను. ఇప్పుడు దర్శకురాలిగా లాంచ్ అయ్యాను. మీ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా సినిమా తీశాం. నిర్మాత బన్నీ వాసు సినిమా చూసి బాగుందన్నారు. ఆయన నోటినుంచి ఆ మాట వినగానే నేను సక్సెస్ అయిపోయా అనిపించింది.
ఎమోషనలైన వరలక్ష్మి
గోపీచంద్ మలినేని సర్ నా ఫ్రెండ్, గురువు, మెంటార్. ఆయనే నన్ను తెలుగులో రీలాంచ్ చేశారు. ఆయన వల్లే నేనీరోజు ఇక్కడ ఉన్నాను. థాంక్యూ సోమచ్ సర్. ఇది నాకు సెకండ్ లైఫ్. ఎక్కువ టెన్షన్స్ వల్ల ఎమోషనల్ అవుతున్నాను అంటూ వరలక్ష్మి శరత్కుమార్ ఏడ్చేసింది. నేను అంత ఈజీగా ఎమోషనల్ అవను. కానీ ఎప్పుడో ఒకసారి మనసారా ఏడ్చేయడం తప్పేం కాదు.
అందుకోసమే ఈ పోరాటం
ఒకమ్మాయిగా ఇండస్ట్రీలో ఉండటం చాలా కష్టం. ఎన్నో అవాంతరాలు దాటుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి పోరాడుతున్న ప్రతి మహిళ కోసం నేను పోరాడుతున్నాను. ఇండస్ట్రీలో మహిళలు ఎదిగేందుకు సహకరించండి అని వరలక్ష్మి శరత్కుమార్ చెప్పుకొచ్చింది. కోలీవుడ్ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి... హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలు చేసింది.
ఆ సినిమాతోనే గుర్తింపు
గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన తెలుగు మూవీ క్రాక్లో జయమ్మగా నటించింది. ఈ మూవీ సూపర్ హిట్ అవడంతో వరలక్ష్మికి తెలుగులో ఆఫర్లు కుప్పలుతెప్పలుగా వచ్చాయి. ఈ క్రమంలోనే తనకు టాలీవుడ్లో గుర్తింపునిచ్చిన గోపీచంద్ మలినేనిని సరస్వతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్కు అతిథిగా ఆహ్వానించి అతడిపై ప్రశంసలు కురిపించింది.


