
జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేస్తామని ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో జూన్పై విడుదలయ్యే సినిమాలపై ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ విషయంపై సమావేశం నిర్వహించారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల డిమాండ్లపై ఫిల్మ్ ఛాంబర్లో చర్చించారు. ఈ నెల 23న మరోసారి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశం నిర్వహించాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శుక్రవారం రోజైనా తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను అద్దె విధానంలో నడుపుతున్నారు. దీని వల్ల తాము నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అందుకే పర్సంటేజీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విధానం అమలు చేయకపోతే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తామని ప్రకటించారు. అయితే తాజా సమావేశంలో పర్సంటేజీ విధానంపై కొందరు నిర్మాతలు మొగ్గు చూపగా.. మరికొందరు ఓకే చేయలేదని సమాచారం. ఈ సమావేశంలో టాలీవుడ్ నిర్మాతలు దిల్ రాజు, సురేశ్బాబు, డీవీవీ దానయ్య, సాహు గారపాటి, బాపినీడు, నాగవంశీ పాల్గొన్నారు.