
‘పేద సినీ కార్మికులకు మేము వ్యతిరేకం కాదు. వారికి ఎప్పుడు అండగానే ఉంటాం’ అన్నారు నిర్మాత మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్. తెలుగు చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల వేతనాలు 30 శాతం పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేస్తూ, సోమవారం నుంచి బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. యూనియన్ డిమాండ్స్ని ఫిలిం ఛాంబర్ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఫిలిం ఛాంబర్ ప్రతినిధులతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు చర్చలు జరిపారు.
అనంతరం ప్రసన్న కుమార్ మీడియాతో మట్లాడుతూ..‘‘ఫిలిం ఛాంబర్తోనే ‘మా’ అసోసియేషన్ కలిసి వెళ్తుందని మంచి విష్ణు చెప్పారు. పేద సినీ కార్మికులకు మేము ఎప్పుడూ అండగానే ఉంటాం. లేబర్ యాక్ట్ ప్రకారం నిర్మాతలు ఒక్కో కార్మికుడికి భారీగానే వేతనం చెల్లిస్తుంది. ఐటీ ఎంప్లాయీస్ కన్నా యూనియన్ కార్మికులకు జీతాలు ఎక్కువ ఉన్నాయి. ఏడెనిమిది లక్షల రూపాయలు చెల్లిస్తేనే యూనియన్లో సభ్యత్వం ఇస్తున్నారు. మా కార్మికులతోనే పని చేయాలి అని యూనియన్ వాళ్ళు చెప్పడం తప్పు.
కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ని కూడా ధిక్కరించి సమ్మెకు పిలుపు నిచ్చారు.ఫెడరేషన్ వాళ్ళవి ఏకపక్ష నిర్ణయాలు.మేం చట్టంపరంగా న్యాయంగా వెళ్తున్నాం. నిర్మాతల పరిస్థితే బాగోలేదు. ఇలాంటి సమయంలో సమ్మె చేయడం సరికాదు. కార్మికులు కూడా మాతో కలిసి వస్తారని ఆశిస్తున్నాం. స్వార్థ పూరిత విధానాలతో కాకుండా అందరం ఒక కుటుంబం లాగా కలసి చర్చించుకుందాం’ అని అన్నారు.