టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వారంలో సంక్రాంతి సందడి ప్రారంభం కానుంది. రేసులో చాలా సినిమాలు ఉన్నాయి. చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ చిత్రాలు కూడా బరిలో ఉన్నాయి. ఇప్పటికే రాజా సాబ్ ట్రైలర్ రావడంతో ఆ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. జనవరి 4న మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్తో వస్తున్నారు. చిరంజీవి సినిమా కావడంతో ఎటూ బజ్ ఉంటుంది. అయితే, ఇప్పుడు ఈ రెండు సినిమాల టికెట్ ధరల గురించి ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో ఎటూ ఈ రెండు చిత్రాలకు టికెట్ ధరలు పెంచుకునేందుకు ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి ఇచ్చేందుకు ఛాన్స్ ఉంది. మరీ తెలంగాణలో పరిస్థితేంటి..? అనేది హాట్ టాపిక్గా మారింది. చిరంజీవి, ప్రభాస్ సినిమాలకు సంబంధించిన చిత్ర యూనిట్లలో ముందుగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు కదుపుతారు అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతుంది. రీసెంట్గా అఖండ-2 మూవీకి టికెట్ ధరలు పెంచితే తనకు తెలియకుండానే అధికారులు జీవో ఇచ్చారని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్లో ఎవరూ టికెట్ రేట్ల పెంపు కోసం తమ ప్రభుత్వం వద్దకు రావద్దని మీడియా ద్వారా సినిమా వాళ్లకు తెలిపారు.
అలాంటిది ఇప్పుడు టికెట్ రేట్ల కోసం ప్రభుత్వంతో చర్చలు ఎవరు జరుపుతారు అనేది తేలాల్సి ఉంది. రాజా సాబ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్, చిరంజీవిలలో ఎవరైనా రంగంలోకి దిగుతారా..? మంత్రి తన మనసు మార్చకుని వెసులుబాటు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో టికెట్ ధరలు పెంపు అనేది లేకుండా ఈ రెండు సినిమాలను విడుదల చేస్తే.. బ్రేక్ ఈవెన్ దాటడం చాలా కష్టమని చెప్పవచ్చు. అయితే, మిగతా సినిమాలకు ఈ సమస్య లేదని చెప్పాలి. అనగనగా ఒక రాజు, భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాల నిర్మాతలు ఇప్పటికే ఈ విషయంపై ఒక ప్రకటన చేశారు. తమ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం లేదని తెలిపారు.


