
సమ్మర్ హాలిడేస్ లేవా గురూ అని ఏ సినిమా సెలబ్రిటీని అడిగినా... వేసవి సెలవుల్లో ప్రేక్షకులకు థియేటర్లలో వినోదం ఇవ్వాలంటే మేం హాలిడేస్ తీసుకోకూడదు గురూ అంటారు. ఎండలు మండిపోతున్నాయి కదా అంటే... నో ప్రాబ్లమ్ అంటారు. ప్రస్తుతం భాగ్యనగరంలో ఎండలు ఏ రేంజ్లో ఉన్నాయో తెలిసిందే. ఎంచక్కా హాలిడే తీసుకుని కూల్ కూల్గా ఉండే విదేశాలు చుట్టి రావొచ్చు. కానీ... మండే ఎండలను లెక్క చేయకుండా హైదరాబాద్లో షూటింగ్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు కొందరు హీరోలు. ఆ స్టార్స్ చేస్తున్న సినిమాల విశేషాలు తెలుసుకుందాం.
జన్వాడలో ఆటా పాటా
హీరో మహేశ్బాబు ఆడిపాడుతున్నారట. అది కూడా ఓ భారీ సెట్లో. ఎందుకంటే ఆయన హీరోగా నటిస్తున్న తాజా సినిమా కోసమే. మహేశ్బాబు, డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా, మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం మహేశ్బాబు పోడవాటి హెయిర్ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్ ఆయ్యారు. ఆయన లుక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారిన సంగతి తెలిసిందే.
అమేజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం హైదరాబాద్ సమీపంలోని జన్వాడలో దాదాపు 550 మందితో ప్రత్యేకంగా సెట్ వేశారు మేకర్స్. ఈ సెట్లో మహేశ్బాబుతో పాటు ప్రధాన తారాగణంపై ఓ భారీ పాటని చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. ఇప్పటికే తొలి షెడ్యూల్ని హైదరాబాద్ ల్యూమినియం ఫ్యాక్టరీలో, రెండో షెడ్యూల్ని ఒడిశాలోని కోరాపుట్లో పూర్తి చేశారు. తాజాగా జన్వాడలో వేసిన ప్రత్యేకమైన సెట్లో మూడవ షెడ్యూల్లో భాగంగా పాట చిత్రీకరణని గ్రాండ్గా జరుపుతున్నారట. ఈ సెట్స్, ఈ సాంగ్ సినిమాలో ఓ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని టాక్. ఈ పాట షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందని సమాచారం. మహేశ్ బాబు–రాజమౌళి వంటి క్రేజీ కాంబినేషలో రూపొందుతోన్న ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి.
ముచ్చింతల్లో జాతర
హీరో రవితేజ జాతరలో సందడి చేస్తున్నారు. సందడంటే మామాలు సందడి కాదు... ఓ రేంజ్లో భారీగా అన్నమాట. మరి... ఆయన సందడి ఏ స్థాయిలో ఉంటుందో తెలియాలంటే ‘మాస్ జాతర’ సినిమా విడుదల వరకూ వేచి చూడాలి. రవితేజ హీరోగా నటిస్తున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘సామజ వరగమన’ మూవీ ఫేమ్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత రవితేజ–శ్రీలీల ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీగా నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. భారీ పీరియాడికల్ స్టోరీతో అరకు అటవీ బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగనుందని టాక్.
ఇటీవల అరకులో ఓ షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ తాజాగా హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్లో చిత్రీకరణ జరపుకుంటోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో రవితేజతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట భాను భోగవరపు. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే విందు భోజనంలాంటి మాస్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ‘సామజవరగమన’ లాంటి హిట్ సినిమా తర్వాత భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండటం, ‘ధమాకా’ సినిమాతో హిట్ పెయిర్గా నిలిచిన రవితేజ, శ్రీలీల రెండోసారి కలిసి నటిస్తుండటం, ‘ధమాకా’ సినిమాకి సూపర్ హిట్ సంగీతం అందించిన భీమ్స్ సిసిరోలియో–రవితేజ కాంబో రిపీట్ అవుతుండటంతో ‘మాస్ ధమాకా’పై భారీ అంచనాలున్నాయి.
గుహల్లో పరిశోధన
హీరో నాగచైతన్య గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి పరిశోధన చేస్తున్నారు. జనరల్గా పురావస్తు శాఖ అధికారులు పరిశోధన జరుపుతుంటారు. మరి... నాగచైతన్య ఎందుకు పరిశోధన చేస్తున్నారు? అంటే ఆయన నటిస్తున్న తాజా సినిమా కోసం అన్నమాట. ‘తండేల్’ మూవీ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నారు నాగ చైతన్య. సాయిదుర్గా తేజ్తో ‘విరూపాక్ష’ (2023) మూవీ తీసి, బ్లాక్బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ రూపొందుతోంది.
‘ఎన్సీ 24’ అనే వర్కింగ్ టైటిల్లో సినిమాని బాపినీడు సమర్పణలో సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో (ఏడెకరాలు) జరుగుతోంది. మిస్టిక్ థ్రిల్లర్గా భారీ బడ్జెట్తో రూపొందుతోన్న ఈ చిత్రం షూటింగ్ కోసం గుహలు, అడవులు, గుట్టలు, కొండలు వంటి ప్రత్యేకమైన సెట్స్ వేశారని టాక్. ఈ చిత్రంలో నాగచైతన్య సరికొత్త లుక్తో కనిపిస్తారని ఇటీవల విడుదలైన స్పెషల్ వీడియో గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. ఈ సినిమా కోసం శారీరకంగా, మానసికంగా ఆయన కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు కూడా. ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుందని చిత్రయూనిట్ ప్రకటించింది.
సెట్లో స్పెషల్ సాంగ్
అల్యూమినియం ఫ్యాక్టరీలో ఆడి పాడుతున్నారు హీరో వరుణ్ తేజ్. అది కూడా ప్రత్యేకమైన పాట కోసం. ఈ ఆటా పాటా ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్) కోసమే. ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ’ వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కుతోంది. రితికా నాయర్ హీరోయిన్గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్పై ‘వీటీ 15’ రూపొందుతోంది.
ఇండో కొరియన్ హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక్కడ వేసిన ఓ సెట్లో ప్రత్యేక పాటని చిత్రీకరిస్తున్నారట మేకర్స్. ఈ పాటలో వరుణ్ తేజ్తో కలిసి ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్ దక్షా నగార్కర్ నటిస్తున్నారని సమాచారం. అంతేకాదు.. ఈ పాటలోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్లోని కోకాపేట సమీపంలో చిరంజీవి–రామ్చరణ్ నటించిన ‘ఆచార్య’ (2022) సినిమా షూటింగ్ కోసం వేసిన ఓ ప్రత్యేకమైన సెట్లోనూ చిత్రీకరించనున్నారని సమాచారం. ఈ సినిమాకు ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారట మేకర్స్.
ముచ్చింతల్లో లెనిన్
అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘లెనిన్ ’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద ఉన్న ముచ్చింతల్లో జరుగుతోంది.
శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతో పాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా కోసం పోడవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్ మాస్ లుక్లోకి మారిపోయారు అఖిల్. ఏప్రిల్ 8న అఖిల్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘లెనిన్ ’ టైటిల్ గ్లింప్స్కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికి పోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు.. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా.. పేరు ఉండదు, అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు.. పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్ చెప్పిన డైలాగ్స్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ‘ఏజెంట్’ సినిమా తర్వాత రెండేళ్ల గ్యాప్ అనంతరం అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్’.
తుక్కుగూడలో సంబరాలు
హీరో సాయిదుర్గా తేజ్ తుక్కుగూడలో సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎంత గ్రాండ్గా చేశారు? అనే విషయాలు తెలియాలంటే సెప్టెంబర్ 25 వరకూ వేచి చూడాల్సిందే. 2023లో విడుదలైన ‘విరూపాక్ష’, ‘బ్రో’ వంటి హిట్ సినిమాల తర్వాత సాయిదుర్గా తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రంలో ఐశ్వర్యా లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రైమ్షో ఎంటర్టైన్ మెంట్పై ‘హను–మాన్’ (2024) వంటి పాన్ ఇండి యన్ హిట్ అందుకున్న కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. ఇక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్లో లాంగ్ షెడ్యూల్ జరుపుతున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్లో హీరో, హీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటిగట్టు) సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
బాచుపల్లిలో తెలుసు కదా!
‘డీజే టిల్లు, టిల్లు స్క్వేర్’ వంటి హిట్ సినిమాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు. రాశీ ఖన్నా, శ్రీనిధీ శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో వైవా హర్ష కీలక పాత్ర పోషిస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని బాచుపల్లిలో జరుగుతోంది. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. సిద్ధు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్కి ఏ మాత్రం తగ్గకుండా వినోదాత్మకంగా, అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట నీరజ కోన. స్టైలిస్ట్గా తానేంటో నిరూపించుకున్న నీరజ దర్శకురాలిగా ఏ స్థాయి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.
శంషాబాద్లో సూపర్ యోధ
బాలనటుడిగా అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న తేజ సజ్జా ‘జాంబి రెడ్డి’ (2021) సినిమాతో హీరోగా పరిచయమై, హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే తేజ సజ్జా హీరోగా నటించిన రెండో చిత్రం ‘హను–మాన్’. గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సూపర్ హిట్ అందుకుంది. ‘హను–మాన్’ వంటి హిట్ చిత్రం తర్వాత తేజ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటుడు మంచు మనోజ్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపడిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమాలో తేజ సూపర్ యోధగా కనిపించనున్నారు. ఇటీవల నేపాల్లో జరిగిన ఓ షెడ్యూల్లో తేజపై భారీ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్లో జరుగుతోందట. తేజ సజ్జాతో పాటు సినిమాలోని ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట కార్తీక్ ఘట్టమనేని.
పై చిత్రాలే కాదు.. మరికొన్ని సినిమాల షూటింగ్స్ కూడా హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్ మోహన్