ప్రముఖ హీరో శివకార్తికేయన్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ కమర్షియల్గా మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. అదే సమయంలో మంచి కంటెంట్తో కూడిన చిన్న చిత్రాలకు తన నిర్మాణ సంస్థ ద్వారా విడుదల చేస్తూ చేయూతనిస్తున్నారు. శివ కార్తికేయన్ తాజాగా కథానాయకుడిగా నటించిన పరాశక్తి చిత్రం కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. చేతిలో ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్న చిత్రంతో పాటు కమలహాసన్ నిర్మించనున్న మరో ప్రాజెక్ట్ ఉంది. వాటిలో ఏది ముందు సెట్స్పైకి వెళుతుందో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుచ్చిలోని కుమారస్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం శివ కార్తికేయన్ మీడియాతో ముచ్చటించారు. 14 ఏళ్ల సినిమా జీవితం తనకు చాలా అందించిందని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలతో పాటు పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ, అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు వాటన్నింటినీ మరిచిపోయేలా చేసింది. నా కుటుంబంపై అలాంటి అభిమానాన్ని కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు అని శివకార్తికేయన్ పేర్కొన్నారు. కాగా తిరుచ్చిలో కుమారస్వామి ఆలయంలో దిగిన ఫొటోలను ఆయన సతీమణి ఆర్తి ఎక్స్ మీడియాలో పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.


