30ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న షారుక్‌ ఖాన్‌- సల్మాన్‌ ఖాన్‌

Shah Rukh Khan And Salman Khan To Star Together For Movie After 30 Years - Sakshi

కొన్ని కాంబినేషన్స్‌ ఎక్కువగా రిపీట్‌ అవుతుంటాయి. అయితే కొన్ని కాంబినేషన్స్‌ రిపీట్‌ కావడానికి దశాబ్దాలు గడిచిపోతాయి. ఇలా మూడు దశాబ్దాల తర్వాత రిపీట్‌ అవుతున్న కొన్ని కాంబినేషన్స్‌లో రూపొందుతున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 

రజనీకాంత్, జాకీ ష్రాఫ్‌ మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి 36 ఏళ్లు పట్టింది. 1987లో ప్రభాత్‌ ఖన్నా దర్శకత్వంలో వచి్చన హిందీ చిత్రం ‘ఉత్తర్‌ దక్షిణ్‌’లో రజనీకాంత్, జాకీ ఫ్రాష్‌ లీడ్‌ రోల్స్‌ చేశారు. మళ్లీ ఈ ఇద్దరు కలిసి ఇప్పుడు తమిళ చిత్రం ‘జైలర్‌’లో నటిస్తున్నారు. ‘జైలర్‌’లో రజనీకాంత్‌ హీరోగా నటిస్తుండగా, జాకీ ష్రాఫ్‌ కీ రోల్‌ చేస్తున్నారు. జాకీది నెగటివ్‌ క్యారెక్టర్‌ అని సమాచారం. రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, శివ రాజ్‌కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే రిలీజ్‌ కానుంది. 

రాజేంద్రప్రసాద్, అర్చన హీరో హీరోయిన్లుగా వంశీ దర్శకత్వంలో 1986లో వచ్చిన ‘లేడీస్‌ టైలర్‌’ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రం తర్వాత  రాజేంద్రప్రసాద్, అర్చన కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోలేదు. మళ్లీ 36 ఏళ్ల తర్వాత రాజేంద్రప్రసాద్, అర్చన ‘షష్టిపూర్తి’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. వీరిద్దరూ లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ చిత్రంలో రూపేష్‌ కుమార్‌ చౌదరి, ఆకాంక్షా సింగ్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

న్యూ ఏజ్‌ ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయాలనుకుంటున్నారు. మా ఆయి ప్రొడక్షన్స్‌పై రూపేష్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అలాగే ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకు స్వరాలు అందించిన ఇళయరాజాయే ‘షష్టిపూర్తి’ చిత్రానికీ బాణీలు సమకూర్చుతుండటం విశేషం.

బాలీవుడ్‌ టాప్‌ స్టార్స్‌ షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా కలిసి నటించిన హిందీ చిత్రం ‘కరణ్‌ అర్జున్‌’. హీరో హృతిక్‌ రోషన్‌ తండ్రి రాకేష్‌ రోషన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1995లో విడుదలై ఘనవిజయం సాధించింది. కాగా ఆ తర్వాత సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘ట్యూబ్‌ లైట్‌’, ‘టైగర్‌ 3’ (విడుదల కావాల్సి ఉంది) చిత్రాల్లో షారుక్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్స్‌ చేశారు. అలాగే షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించిన ‘జీరో’, ‘పఠాన్‌’ చిత్రాల్లో సల్మాన్‌ ఖాన్‌ గెస్ట్‌ రోల్స్‌ చేశారు.

కానీ సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ హీరోలుగా కలిసి నటించలేదు. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్, షారుక్‌ ఖాన్‌ హీరోలుగా యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ ‘పఠాన్‌ వర్సెస్‌ టైగర్‌’ అనే సినిమా రూపొందించనుందని బాలీవుడ్‌లో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి వెళ్తుందని బీ టౌన్‌ టాక్‌. ఈ లెక్కల ప్రకారం షారుక్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌ హీరోలుగా మరో సినిమా రావడానికి 30 ఏళ్లు పట్టింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top