ఓటీటీలో కోర్ట్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే? | Sattamum Needhiyum Streaming On This OTT Platform | Sakshi
Sakshi News home page

OTT: ఓటీటీలో కోర్ట్‌ డ్రామా.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Jul 19 2025 2:29 PM | Updated on Jul 19 2025 2:59 PM

Sattamum Needhiyum Streaming On This OTT Platform

చట్టం, పోలీస్‌ వ్యవస్థ ఈ రెండూ శక్తివంతమైనవే. అయితే ఒక్కోసారి ఈ రెండూ డబ్బుకు అమ్ముడుపోతుంటాయి. అలాంటప్పడు సామాన్యుడికి న్యాయం లభించడమనేది గగనంగా మారుతుంది. అయితే న్యాయం కోసం అలుపెరగకుండా పోరాడే న్యాయవాదులు ఉంటారు. న్యాయాన్ని గెలిపించేందుకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఓడిపోయినా.. డబ్బు ఎక్కువై విర్రవీగేవారితో, అవినీతిపరులైన డిపాంర్ట్‌మెంట్‌ అధికారులతో అలుపెరుగని పోరాటం చేస్తుంటారు. 

చట్టముమ్‌ నీతియుమ్‌
అందులో అవమానాలు, అవరోధాలు ఎదురైనా వెనుకడుగు వేయరు. అలాంటి ఒక న్యాయవాది ఇతి వృత్తంతో రూపొందిన తమిళ వెబ్‌ సిరీస్‌ చట్టముమ్‌ నీతియుమ్‌ (Sattamum Needhiyum). నటుడు పరుత్తివీరన్‌ శరవణన్‌ ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి నమ్రిత, అరుళ్‌ డీ.శంకర్, షణ్ముగం, తిరుసెల్వమ్, విజయశ్రీ, ఇనియరామ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. బాలాజీ సెల్వరాజ్‌ డైరెక్ట్‌ చేశాడు. 18 క్రియేటర్స్‌ పతాకంపై శశికళ ప్రభాకరన్‌ నిర్మించారు. 

న్యాయాన్ని గెలిపించలేక..
డబ్బుకు లోకం దాసోహం అవుతున్న తరుణంలో సామాన్యులకు న్యాయం అనేది అందని ద్రాక్షలాగే మారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఒక అమాయకుడికి న్యాయస్థానంలో న్యాయాన్ని అందించలేకపోయిన ఒక నిజాయితీ పరుడైన న్యాయవాది అదే కోర్టు బయట నోటరీలు రాసుకుంటూ కాలం గడుపుకుంటాడు. దీంతో ఆయనకు ఇంటా బయట కనీస మర్యాద కూడా లేని పరిస్థితి. 

ఏ ఓటీటీలో అంటే?
అలాంటి వ్యక్తి ఆవేశంతో, సమాజంపై కోపంతో.. తన కళ్ల ముందు జరిగిన దుర్ఘటనపై ప్రజావ్యాజ్యం వేస్తాడు. అప్పుడూ పరిహాసానికి గురవుతాడు. అతడు న్యాయం కోసం చేసే  నిరంతర పోరాటమే చట్టముమ్‌ నీతియుమ్‌. పలు ఆసక్తికరమైన అంశాలతో సహజత్వానికి దగ్గరగా రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌లో పరుత్తివీరన్‌ శరవణన్‌ న్యాయవాదిగా ప్రధానపాత్ర పోషించారు. ఈ వెబ్‌ సిరీస్‌ శుక్రవారం (జూలై 18) నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  

చదవండి: హీరోయిన్‌ ఫామ్‌హౌస్‌లో దొంగతనం.. సీసీటీవీలు ధ్వంసం!

Advertisement
 
Advertisement
Advertisement