
‘‘ఈ మధ్య ప్రేక్షకులను థియేటర్స్కు తీసుకురావడం చాలా కష్టమైపోయింది. అయితే స్టార్ హీరో చేసిన సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్కు ఎలాగైతే వస్తున్నారో... అలా ఓ మంచి కంటెంట్ ఉన్న సినిమాను చూసేందుకూ వస్తారని నమ్ముతాను. ‘శుభం’ సినిమా ప్రేక్షకులను థియేటర్స్కు రప్పిస్తుందని ఈ సినిమా నిర్మాతగా నమ్ముతున్నాను’’ అని హీరోయిన్ సమంత అన్నారు. హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రియా కొంతం, శ్రావణి లక్ష్మీ, వంశీధర్ గౌడ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో ట్రా లా లా మూవీంగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన ఈ తొలి చిత్రం ఈ నెల 9న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సమంత చెప్పిన విశేషాలు...
⇒ నేను హీరోయిన్గానే కొనసాగాలని సినిమాలు చేసుకుంటూ వస్తున్న సమయంలో హఠాత్తుగా నాకు నటనలో లాంగ్ బ్రేక్ వచ్చింది. అనారోగ్యాన్ని అధిగమించడానికి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. నటించలేకపోతున్నాను....ప్రోడక్షన్ చేద్దామని అనుకున్నాను. అలా ‘శుభం’ సినిమాను మొదలుపెట్టాం. ఎనిమిది నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాం. దాదాపు వంది మంది ‘శుభం’ సినిమా చూసి,పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. సినిమా విజయంపై నమ్మకం ఉంది.
⇒ ‘శుభం’ సినిమా ఓ టీవీ సీరియల్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సీరియల్ ‘శుభం’ కార్డు కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. న్యూ ఏజ్ హారర్ కామెడీ ఫిల్మ్ ఇది. సోషల్ సెటైర్లా ఉంటుంది. ఈ సినిమాకు కాస్త బడ్జెట్ ఎక్కువైంది.ప్రోడ్యూసర్గా నాకు భవిష్యత్ ఉందా? లేదా అనేది ‘శుభం’ రిలీజ్ తర్వాత తెలుస్తుంది. నేను తెలివైన నిర్మాతను కాకపోవచ్చు, తెలివైన బిజినెస్ ఉమెన్ని కాకపోవచ్చు. అయితే నా మనసు ఏం చెబుతుందో ఆ నిర్ణయాలనే తీసుకుంటా. ఫైనాన్షియల్ వ్యవహారాలను మా బిజినెస్పార్ట్నర్ హిమాంక్ చూసుకుంటుంటారు. ‘శుభం’ సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం అనేది తర్వాత చెబుతాను. ప్రస్తుతానికి నా దగ్గర కొంచెం డబ్బులైతే ఉన్నాయి (నవ్వుతూ..)
⇒ 2010లో దర్శకులు గౌతమ్ మీనన్గారు పిలిస్తే ఏ హీరోయిన్ అయినా ఆయన సినిమాకి ఓకే చెప్పేవారు. కానీ ఆయన రిస్క్ తీసుకుని, నాకు నటిగా తొలి (ఏ మాయ చేసావె) చాన్స్ ఇచ్చారు. పదిహేనేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. ఇప్పుడు నిర్మాతగా కొత్త కథలు చె΄్పాల్సిన బాధ్యత నా మీద ఉందనిపించింది. కొత్తవారితో పని చేయాలి. అందుకే నిర్మాతగా నా తొలి సినిమాలో నేను మెయిన్ లీడ్ రోల్ చేయలేదు. ఈ సినిమాలో అతిథిపాత్ర ఉంది. నాకు ఫేవర్స్ అడగటం ఇష్టం లేదు. అందుకే ఈ రోల్ను నేనే చేశాను.
⇒ ‘శుభం’లో నూతన నటీనటులు నటించారు. కెరీర్ కోసం వాళ్లు చాలా త్యాగాలు చేశారు. వాళ్ల స్టోరీస్ వింటుంటే నిర్మాతగా గర్వంగా అనిపించింది. అలాగే నా తొలి సినిమా ‘ఏ మాయ చేసావె’ రోజులు గుర్తొచ్చాయి. ఇప్పటివరకు నేనుప్రోడ్యూసర్స్ యాక్ట్రస్ అనుకున్నాను. కానీ... నేను ఇంకాప్రోడ్యూసర్స్ ఫ్రెండ్లీ యాక్ట్రస్గా ఉండాలని నాకనిపించింది.
⇒ ఈక్వల్ స్కిల్... ఈక్వల్ ఎక్స్పీరియన్స్... ఈక్వల్ పే ఉండాలని నా డ్రీమ్. మా ప్రోడక్షన్ హౌస్లో సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తాను. కథలు వినేటప్పుడే ఇందులో ఈక్వెల్ పే సాధ్యమౌతుందా? అని ఆలోచించి నిర్ణయించుకుంటాను. నా ప్రోడక్షన్లో నెక్ట్స్ మూవీ ‘మా ఇంటి బంగారం’. జూన్లో మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. నా నుంచి సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. కొన్ని పనులు జరుగుతున్నాయి. ఆ విషయాలు త్వరలో చెబుతాను. ∙అమెరికాలో విదేశీ సినిమాలపై వందశాతం సుంకం విధించారనేది ఇంకా అమలులోకి రాలేదని అనుకుంటున్నాను. అయినా ప్రతివారం మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి కదా.
⇒ నా ఫ్యాన్ ఒకరు నా కోసం గుడి కట్టారని విన్నాను. ఆ అభిమాని ప్రేమను అర్థం చేసుకోగలను. ఆ ప్రేమను అగౌరవపరచలేను. కానీ ఈ విధానాన్ని (గుడి కట్టడం, పూజలు చేయడం వంటివి) ప్రోత్సహించను. ∙జీవితం పట్ల మీ దృష్టికోణం చాలా మారిపోయినట్లుగా కనిపిస్తోంది. వృత్తి, వ్యక్తిగత జీవితాల విషయంలో ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్న ప్రశ్నకు... ‘‘మళ్లీ నా వ్యక్తిగత జీవితం గురించి నా లైఫ్లో బహిరంగంగా మాట్లాడను (నవ్వుతూ). ఆ ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది’’ అన్నారు సమంత.