ఆ విషయంలో తప్పు చేశాను: సమంత | samantha chit chat with fans in social media | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో తప్పు చేశాను: సమంత

Jun 30 2024 12:12 AM | Updated on Jun 30 2024 12:13 AM

samantha chit chat with fans in social media

‘‘నేను గతంలో కొన్ని ఉత్పత్తులకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించి తప్పు చేశాను. అయితే కావాలని చేసిన తప్పు కాదు’’ అంటున్నారు సమంత. గత ఏడాది విడుదలైన ‘ఖుషి’ తర్వాత సినిమాల నుంచి బ్రేక్‌ తీసుకుని, పూర్తి స్థాయిలో ఆరోగ్యంపై దృష్టి పెట్టారామె (గతంలో మయోసైటిస్‌ బారినపడ్డారు). అయితే సినిమాలకు గ్యాప్‌ ఇచ్చినా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన ఫొటోలు, వీడియోలు షేర్‌ చేయడంతో పాటు అభిమానులతోనూ ముచ్చటిస్తుంటారు.

ఈ క్రమంలోనే తాజాగా అభిమానులతో చిట్‌ చాట్‌ చేశారు సమంత. ‘ఆరోగ్యం గురించి ఇప్పుడు మీరు మంచి విషయాలు చెబుతున్నారు. కానీ గతంలో మీరే అనారోగ్యకరమైన ఉత్పత్తులని ప్రమోట్‌ చేశారు కదా?’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించారు. ఇందుకు సమంత బదులిస్తూ– ‘‘అవును.. నేను గతంలో తప్పులు చేసిన మాట వాస్తవమే. కానీ కావాలని చేసినవి కావు. వాటి గురించి తెలిసిన తర్వాత ఆ బ్రాండ్స్‌ను ప్రమోట్‌ చేయడం మానేశాను.

ప్రస్తుతం నేను ఏదైతే చేస్తున్నానో వాటిని మాత్రమే ప్రమోట్‌ చేస్తున్నాను’’ అన్నారు.  కొత్త వెబ్‌ సిరీస్‌లో... దర్శక–ద్వయం రాజ్‌ అండ్‌ డీకే తెరకెక్కించిన వెబ్‌ సిరీస్‌ ‘ది ఫ్యామిలీ మేన్‌ 2’లో సమంత నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వారిద్దరూ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్‌: హనీ బన్నీ’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ సమంత నటించారు. ఈ సిరీస్‌ త్వరలోనే స్ట్రీమింగ్‌ కానుంది. కాగా రాజ్‌ అండ్‌ డీకే ద్వయం దర్శకత్వం వహించనున్న కొత్త వెబ్‌ సిరీస్‌లో సమంత కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్‌ కపూర్‌ కూడా నటించనున్నారట. ఈ వెబ్‌ సిరీస్‌కి ‘రక్తబీజ్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారని భోగట్టా. ఆగస్ట్‌లో ఈ సిరీస్‌ షూటింగ్‌ ఆరంభం కానుందని సమాచారం. 

Advertisement
 
Advertisement
Advertisement