ఎట్టకేలకు వారి కోరికను నెరవేర్చిన సల్మాన్‌

Salman Khan Confirms Radhe Release On Eid 2021 - Sakshi

'రండి బాబూ రండి, విచ్చేయండి..' అని ఆహ్వానం పలుకుతున్నా చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. జనాలతో కిటకిటలాడే సినిమా హాళ్లు ఇలా బోసిగా కనిపించడంతో థియేటర్‌ యాజమాన్యానికి గుబులు పట్టుకుంది. ఏదైనా పెద్ద సినిమా వస్తే జనాలు వాళ్లంతట వాళ్లే థియేటర్లకు వస్తారని బాలీవుడ్‌ థియేటర్‌ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా నటించిన 'రాధే: యువర్‌ మోస్ట్‌ వాంటెడ్‌ భాయ్'‌ను థియేటర్లలోనే విడుదల చేయమంటూ ఫిల్మ్‌ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ ఆమధ్య లేఖ రాసింది. కష్టసమయంలో థియేటర్స్‌ బిజినెస్‌కు సహాయంగా నిలబడాలని, ఈ ఈద్‌కి మీ సినిమాను థియేటర్స్‌కు తీసుకురండి భాయ్‌ అని 2021 ప్రారంభంలోనే సల్మాన్‌ని కోరారు. (చదవండి: హనీమూన్‌కు వెళ్లిన బిగ్‌బాస్‌ నటి)

ఈ విన్నపానికి ఎట్టకేలకు సల్లూభాయ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. "ఈ నిర్ణయం తీసుకోడానికి ఇంత కాలం తీసుకున్నందుకు క్షమించాలి. ఎగ్జిబిటర్లు, థియేటర్‌ ఓనర్లు చవిచూస్తున్న గడ్డు పరిస్థితుల గురించి నాకు తెలుసు. ఈ కష్టకాలంలో రాధేను థియేటర్లలో విడుదల చేసి వారికి సహాయం చేయాలనుకుంటున్నాను. అయితే ఇందుకు ప్రతిఫలంగా థియేటర్లలోకి వచ్చేవారి కోసం పలు జాగ్రత్తలు పాటించాలి. ఈ ఈద్‌కు రిలీజ్‌ అవుతున్న రాధేను థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి" అని చెప్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టారు. నిజానికి ‘రాధే’ను జీ 5 మొత్తం రూ 230 కోట్లకు కొనుగోలు చేసింది. శాటిలైట్, డిజిటల్, థియేట్రికల్‌ రిలీజ్‌ కోసం ఈ మొత్తానికి డీల్‌ కుదిరింది. కానీ థియేటర్ల యాజమానుల విజ్ఞప్తి మేరకు ఈ సినిమాను తొలుత థియేటర్లలోనే రిలీజ్‌ చేయనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌కు జోడీగా హీరోయిన్‌ దిశా పటానీ నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్‌, జరీనా వాహబ్‌, రణ్‌దీప్‌ హుడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కు ప్రభుదేవా డైరెక్షన్‌ చేస్తున్నారు. (చదవండి: నాలుగు రోజుల్లోనే లాభాలొచ్చాయి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top