
‘‘విరూపాక్ష’ చిత్రాన్ని దయచేసి థియేటర్లలో చూడండి.. సినిమా అదిరిపోద్ది. ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది. మా సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన తారక్ అన్నకి (ఎన్టీఆర్) థ్యాంక్స్.. ఆయన వాయిస్ మా మూవీకి చాలా ప్లస్ అయింది’’ అని హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘విరూపాక్ష’. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది.
ఆదివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ–‘‘అభిమానులు, ప్రేక్షకుల ఆశీర్వాదాల వల్లే నేను మళ్లీ ఈ వేదికపై నిలుచున్నా. మీ అందరి ప్రార్థనలు, సపోర్ట్ వల్లే ‘విరూపాక్ష’ బయటికి వచ్చింది. 2019లో సుకుమార్గారు ఫోన్ చేసి, ‘విరూపాక్ష’ కథ వినమన్నారు. ప్రేమకథ అయ్యుంటుందిలే చేసేద్దాం అనుకున్నా. కానీ, కార్తీక్ వచ్చి థ్రిల్లర్ అనగానేషాక్ అయ్యాను. ‘విరూపాక్ష’ కథ మొత్తం విన్నాక ఇది బ్లాక్బస్టర్ అవుతుంది, చేయాలని ఫిక్స్ అయిపోయాను.
మా కొడుకులు ‘విరూపాక్ష’ సినిమా చేశారని మా అమ్మ, కార్తీక్ అమ్మ గర్వంగా చెబుతారు. సెట్స్లో నాకు ధైర్యం చెబుతూ సపోర్ట్ చేసిన ప్రసాద్, సుకుమార్, బాపినీడుగార్లకు, తోటి నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు. ‘‘2018లో సుకుమార్గారికి ‘విరూపాక్ష’ కథ చెప్పాను. కరోనా, లాక్డౌన్, తేజ్గారికి ప్రమాదం వల్ల సినిమా ఆలస్యం అయ్యింది’’ అన్నారు కార్తీక్ దండు. ‘‘విరూపాక్ష’ యూనివర్సల్ సబ్జెక్ట్.. అందుకే పాన్ ఇండియా స్థాయిలో తీశాం’’ అన్నారు బీవీఎస్ఎన్ ప్రసాద్.