
అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం తర్వాత బాలీవుడ్ నటి రవీనా టాండన్ ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తొలిసారి ఎయిరిండియా ఫ్లైట్లో ప్రయాణిస్తున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ విషాదం తర్వాత కూడా ప్రయాణికుల కోసం చిరునవ్వుతో పలకరిస్తున్న ఎయిరిండియా క్యాబిన్ సిబ్బందిపై ఆమె ప్రశంసలు కురిపించారు. విమాన ప్రమాదం తర్వాత సిబ్బంది, ప్రయాణీకులలో నెలకొన్న భయం, మానసిక స్థితి గురించి ప్రస్తావించింది.
రవీనా ఇన్స్టాలో రాస్తూ.. 'కొన్ని ప్రారంభాలు అన్ని అడ్డంకులను తట్టుకుని నిలవాలి. ప్రస్తుతం ఎయిరిండియా సిబ్బంది బాధలో ఉన్నప్పటికీ కొత్త సంకల్పం కోసం చిరునవ్వులతో ప్రయాణికులను స్వాగతిస్తున్నారు. ప్రయాణీకులు, సిబ్బంది మధ్య ఏదో తెలియని బంధం ఏర్పరుచుకున్నారు. ఈ విషాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు సంతాపం. ఇది ఎప్పటికీ నయం కాని గాయం. కానీ ఎయిరిండియా ఎల్లప్పుడూ ఇలాంటి వాటిని అధిగమించి మళ్లీ బలంగా నిలబడాలనేదే వారి సంకల్పం' అంటూ ఫ్లైట్లో తాను దిగిన ఫోటోలను కూడా పంచుకుంది. బాధలోనూ తమ సంస్థ కోసం సిబ్బంది కష్టపడుతున్న తీరుపై రవీనా టాండన్ ప్రశంసలు కురిపించారు. కాగా.. జూన్ 12న జరిగిన విమాన ప్రమాదంలో 241 మంది మరణించిన సంగతి తెలిసిందే.