
హీరో రాజ్ తరుణ్ (Raj Tarun), అతడి స్నేహితుడు శేఖర్ బాషా వల్ల తనకు ప్రాణహాని ఉందని లావణ్య (Lavanya) ఆరోపించింది. తనకు న్యాయం చేయాలంటూ శనివారం నాడు నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. తనకు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదుటే ప్రాణాలు విడుస్తానంది. మీడియాతో లావణ్య మాట్లాడుతూ.. ఇటీవల నాపై కొందరు దాడికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నిన్న రాత్రి నలుగురు వ్యక్తులు నా ఇంటిపైకి వచ్చారు. భయంతో బతుకున్నాను. నా ప్రాణం పోయాక చర్యలు తీసుకుంటారా? ఆ ఇంటి కోసమే నాపై ఇలా దాడి చేస్తున్నారు.
రూ.55 లక్షల అప్పు
నిజానికి ఆ ఇంటిపై తెలంగాణ మంత్రి బంధువుల దగ్గరి నుంచి రూ.55 లక్షలు అప్పు తీసుకున్నాం. నాలుగేళ్లవుతోంది.. రెండేళ్లుగా మా గొడవల వల్ల వడ్డీ చెల్లించడం లేదు. కాస్త గడువు ఇవ్వమని అడుగుతూ వచ్చాం. నిన్న సాయంత్రం వారు మాకు ఫోన్ చేశారు. వారం రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే ఇల్లు ఆక్రమించుకుంటామన్నారు. అందుకు నేను ఒప్పుకున్నాను. రెండుమూడురోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తాను. ఇకపోతే ఆ మంత్రి పేరు నేను చెప్పలేను. నాలుగురోజుల్లో ఇల్లు ఆక్రమించుకోవడానికి వస్తారు. అప్పుడు మీకే తెలుస్తుంది.
పరువు పోతుందని ఆగా..
ఒకవేళ రాజ్తరుణ్.. అప్పిచ్చిన వ్యక్తికి రూ.55 లక్షలు ఇచ్చినా సరే ఆ ఇంటిని మళ్లీ రాజ్తరుణ్కు ఇవ్వకూడదని కోరతాను. ఎందుకంటే ఆ ఇంట్లో నా వాటా కూడా ఉంది. ఇప్పటికే రాజ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో అతడిపై కేసులు కూడా వేసేందుకు సిద్ధమయ్యారు. పరువు పోతుందని ఇంతకాలం ఈ విషయం బయటకు చెప్పలేదు అని లావణ్య పేర్కొంది.