
టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) కిడ్నీ సంబంధిత వ్యాధితో మరణించారు. అయితే, ఆయన మరణం తర్వాత సినీ పరిశ్రమపై విమర్శలు వచ్చాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సాయం కోసం ఆయన కుటుంబం అభ్యర్తించారు. కానీ, పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేదని నెటిజన్లు తప్పుబట్టారు. మరణించినా కూడా ఆ కుటుంబానికి సానుభూతి కూడా తెలపలేదని విమర్శించారు. ఒక ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు, సాంకేతిక నిపుణుడు చనిపోతేనే ఇండస్ట్రీ మొత్తం తరలి వస్తుంది. కానీ, చిన్న నటులు మరణిస్తే కనీసం సాయం, స్పందన కూడా పరిశ్రమ నుంచి కనపించలేదని విమర్శలు వచ్చాయి. ఇదే అంశంపై తాజాగా నిర్మాత నట్టి కుమార్ స్పందించారు.
ఫిష్ వెంకట్ మరణం గురించి నిర్మాత నట్టి కుమార్ ఇలా చెప్పారు. ' కొంత కాలంగా ఆయన సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారు. పరిశ్రమతో సత్ససంబంధాలు కొనసాగిస్తున్న వారు మరణిస్తే ఈ సెలబ్రిటీలు అక్కడ కనిపిస్తారు. సినిమా అంటేనే ఒక బిజీ ప్రపంచం.. ఎవరి పనిలో వారు ఉంటారు. ఇక్కడ ఎవరు మరణించారు..? అని తెలుసుకునేంత టైమ్ ఎవరికీ ఉండదు. నేను చెబుతున్న మాటలు ఫిష్ వెంకట్ ఫ్యామిలీతో పాటు ప్రేక్షకులకు కూడా బాధ ఉండొచ్చు. రేపు ఇలాంటి పరిస్థితి నాకు వచ్చినా అంతే.. సినిమా పరిశ్రమలో కొన్ని సామాజిక వర్గాలు, ఫిలిం ఛాంబర్తో నిత్యం టచ్లో ఉన్నవారికి ఏదైనా జరిగితే వారి సన్నిహితులు తప్పకుండా వెళ్తారు. గబ్బర్సింగ్ గ్యాంగ్తో ఫిష్ వెంకట్ టచ్లో ఉంటారు. కాబట్టి, వారు ఆయనతో కనిపిస్తున్నారు. మిగిలిన వారు ఎవరూ అయ్యోపాపం అని కూడా అనరు.
వెంకట్ను ఎవరూ పలకరించలేదని చాలామందికి బాధ ఉండొచ్చు. మొదట ఆయన అసోషియేషన్ మెంబర్ కాదు. సభ్యత్వం కూడా తీసుకోలేదు. సినిమా ఇండస్ట్రీలో సాయం చేస్తారని ఎవరూ ఆశించకండి.. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాల్సిందే. వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారని ఎదురుచూడకండి. రోజుకు రూ. 3వేల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయి నుంచి రూ. 30 వేలు తీసుకునే రేంజ్కు కూడా వెంకట్ చేరుకున్నాడు. మన దగ్గరకు డబ్బు వచ్చినప్పుడే జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇక్కడ ఎవరూ సాయం చేస్తామని ముందుకు రారు. ఈ విషయంలో ఒకరిని తప్పుబట్టడం ఎందుకు..? లేనివాడికి ప్రాణం మీద ప్రేమ, ఉన్నవాడికి డబ్బు మీద ప్రేమ. కాబట్టి దీనిని మనం అర్థం చేసుకోవాలి. మాట సాయం చేయగలరేమో కానీ, ఆర్ధిక సాయాలు అందరూ చేయరు.' అని నట్టి కుమార్ అన్నారు.