గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2018లో సింగర్ నిక్ జోనస్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 2022లో సరోగసి ద్వారా కూతురు మాల్తీ మేరీ జన్మించింది. అయితే పుట్టినప్పుడు బిడ్డ ఆరోగ్యంగా లేకపోగా ఆమెకు రక్తమార్పిడి చేయాల్సి వచ్చింది. పొత్తిళ్లలో ఎత్తుకుని నవ్వులు పంచాల్సిన చిన్నారి ఆపరేషన్ థియేటర్లో పోరాడుతుంటే ప్రియాంక దంపతుల మనసు తల్లడిల్లిపోయింది. కానీ, వీరి ప్రార్థనలు ఫలించి మాల్తీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగొచ్చింది.
మిరాకిల్ బేబీ
ఆనాటి సంగతులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది ప్రియాంక చోప్రా. ప్రియాంక మాట్లాడుతూ.. నాకు ప్రెగ్నెన్సీలు కలిసిరాలేదు. చాలా కష్టాలు చూశాను. అప్పుడు నాకు (సరోగసి ద్వారా) మిరాకిల్ బేబీ పుట్టింది. తను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన మరుక్షణం నాకింక ఏమీ కనిపించలేదు. సమస్తం ఆగిపోయినట్లే అనిపించింది.
మాల్తీ ఏం చేస్తుందో?
కాకపోతే తనగురించి ఎప్పటికీ భయపడుతూనే ఉంటాను. తను స్కూల్లో ఉన్నా.. నేను వేరే దేశంలో ఉన్నా.. మాల్తీ ఏం చేస్తుందో? ఎలా ఉందో? అని నా గుండె తనకోసమే కొట్టుకుంటూ ఉంటుంది. తను జోక్స్ చెప్తుంది, గొంతెత్తి పాడుతుంది. నన్ను, నా భర్తను, మా కుటుంబం మొత్తాన్ని ఎప్పటికప్పుడు సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది. నా జీవితంలో తనే గొప్ప బహుమతి.
నా ఆలోచనంతా తన చుట్టూనే..
తను వచ్చాకే నా ప్రాధాన్యతలన్నీ మారిపోయాయి. మొదటి, చివరి ఆలోచన తన గురించే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. ప్రియాంక ఇటీవలే ద బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం వారణాసి అనే సినిమా చేస్తోంది. రాజమౌళి దర్శకత్వం మహేశ్బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.


