ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు రూ. 400 కోట్ల వరకు వసూళ్లను సాధించి, రికార్డు సృష్టించింది. తాజాగా ఈ మూవీపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ తన విశ్లేషణను (రివ్యూ) పంచుకున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాజేంద్ర ప్రసాద్, నరేశ్ వంటి వారితో కేవలం కామెడీ సినిమాలు తీయడం వేరు, కానీ చిరంజీవి వంటి మాస్ హీరోతో పూర్తిస్థాయి యాక్షన్ కామెడీ చేయడం ఒక సాహసమని, దాన్ని అనిల్ రావిపూడి విజయవంతంగా పూర్తి చేశారని పరుచూరి కొనియాడారు. నిర్మాతగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల మొదటి ప్రయత్నంలోనే తండ్రిని మళ్లీ ‘ఇంద్రసేనుడిలా’ సింహాసనంపై కూర్చోబెట్టారని ప్రశంసించారు.కేవలం వినోదం మాత్రమే కాకుండా, ప్రేక్షకులను మళ్లీ మళ్లీ థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా సక్సెస్ అయిందని, అందుకే రూ. 400 కోట్ల క్లబ్లో చేరిందని ఆయన పేర్కొన్నారు.
‘మొదటి సన్నివేశంలో హీరో పాత్రకు పెళ్లి అయిందని భార్యకు దూరంగా ఉంటాడని చూపించారు. రెండో సన్నివేశంలోనే హీరో పాత్ర తీరు చెప్పారు. టీవీ సీరియల్తో తన కథను ముడిపెడుతూ చూపించారు. హీరోకు చిన్న కామెడీ టీమ్ని పెట్టి ఆ టీమ్లో ఒక హీరోయిన్ ఉండేలా చూశారు. ఆమెను కామెడీ టీమ్లో ఎందుకు పెట్టారు అని అందరికీ అనుమానం కలిగింది. అలా ఎందుకు పెట్టారో చివర్లో చూపించారు. హీరో, హీరోయిన్ ఎప్పుడు కలుస్తారు? ఎలా కలుస్తారు.. ఇలా ప్రశ్నలు మనం వేసుకుంటూ ఉంటాం కానీ మనకంటే ముందు రచయిత, దర్శకులు వేసుకొని వాటిని పద్ధతి ప్రకారం స్క్రీన్ప్లే చేశారు. మధ్యమధ్యలో ఎమోషనల్ డైలాగులతో కూడా ఆకట్టుకున్నారు. ‘నువ్వు ఎప్పుడైనా నీ పిల్లల్ని చూడాలని అనిపించి మా ఇంటికి వస్తే గేటు దగ్గర నిలబడి రిక్వెస్ట్ చేయి. పైనుంచి చూపిస్తా. పిల్లల్ని చూసి వెళ్లిపో’ అన్న మనిషి ప్రమాదంలో పడితే.. అతడిని హీరో ఎలా కాపాడాడు అనేది గొప్పగా చూపించారు.
కామెడీ టీమ్లో ఉన్న హీరోయిన్.. చివరకు వెంకటేశ్ను పెళ్లి చేసుకోవడం ట్విస్ట్. ఇందులో మధ్యమధ్యలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. దీన్ని యాక్షన్ కామెడీ థ్రిల్లర్ అని కూడా అనొచ్చు. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు అనిల్ రావిపూడిని ప్రత్యేకంగా అభినందించడానికి, చిరంజీవికి చిన్న సెల్యూట్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పటికీ అదే ఎనర్జీ, అవే స్టెప్లు, అవే మూమెంట్లు అస్సలు ఏమాత్రం తేడా లేదు. మా చిరంజీవి.. ఎప్పటికీ మా చిరంజీవే అనిపించుకున్నారు’అంటూ తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు.


