
తమిళసినిమా: లేడీ సూపర్స్టార్ నయనతార ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో షారూక్ఖాన్కు జంటగా నటిస్తున్న జవాన్ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తదుపరి తన 75వ చిత్రంలో నటించటానికి సిద్ధమవుతున్నారు. దీనికి దర్శకుడు శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించనున్నారు. ఇంతకుముందు అట్లీ దర్శకత్వంలో రాజా రాణి అనే చిత్రంలో నయనతార నటించిన విషయం తెలిసిందే. అందులో నటుడు ఆర్య, జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ చిత్రం నయనతారకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
అదే విధంగా తాజాగా నీలేష్కృష్ణ దర్శకత్వంలోనూ నయనతారతో పాటు నటుడు జయ్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. కాగా నటి నయనతార ఇటీవల ఓ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా అవార్డులు కూడా అందుకున్నారు. ఆ సందర్భంగా ముందుగా నయనతార మణిరత్నం కాళ్లకు నమస్కారం పెట్టగా ఆయన ఆమెను ఆశీర్వదించారు. ఆ వేదికన నయనతార తన చిరకాల కోరిక గురించి వెల్లడించారు. ఆమె పేర్కొంటూ దర్శకుడు మణిరత్నం చేతుల మీదుగా ఈ అవార్డును అందుకోవటం గర్వంగా ఉందన్నారు. అయితే అందరూ నటీనటుల మాదిరిగానే ఆయన దర్శకత్వంలో ఓ చిత్రంలోనైనా తాను నటించాలంటూ చిరకాల కోరికను ఆ సందర్భంలో బయటపెట్టారు.
ఇంతకుముందు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని చిత్రాలలో నటించే అవకాశం వచ్చినా ఏదో ఓ కారణంగా అది కార్యరూపం దాల్చలేదన్నారు. కాగా అదే విధంగా రజనీకాంత్, విజయ్, అజిత్, ధనుష్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన నయనతార ఇప్పటి వరకు లోకనాయకుడు కమలహాసన్తో జతకట్టలేదు. కాగా త్వరలో కమలహాసన్ కథానాయకుడిగా ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నయనతారకు నటించే అవకాశం కల్పిస్తారా..? అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు కోలీవుడ్లో జరుగుతోంది.