వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. గతవారమే ‘విష్ణు విన్యాసం’తో ప్రేక్షకులను పలకరించిన ఈ టాలెంటెడ్ హీరో.. ఇప్పుడు ‘మృత్యుంజయ్’తో మరోసారి థియేటర్స్లోకి వచ్చాడు. ఈ సారి తన కామెడీ జానర్ని వదిలి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్తో వచ్చాడు. మరి ‘మృత్యుంజయ్’ ఏమేరకు థ్రిల్ని పంచింది? శ్రీవిష్ణు ప్రయోగం ఫలించిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
జయ్ (శ్రీవిష్ణు)..ఓ ప్రముఖ దినపత్రికలో యాడ్ డిపార్ట్మెంట్లో పని చేస్తుంటాడు. ఎప్పటికైనా క్రైమ్ రిపోర్టర్గా మారాలనేది తన కల. ‘శ్రద్ధాంజలి’ యాడ్స్ కోసం చనిపోయిన వారి ఇంటికి వెళ్లి.. వాళ్ల గురించి గొప్పలు చెబుతూ కుటుంబ సభ్యుల నుంచి ప్రకటనల్ని తీసుకోస్తుంటాడు. అలా ఓ సారి అచ్యుత్రావు (బాలాదిత్య) అనే వ్యక్తి చనిపోయాడని తెలుసుకొని.. వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ సైలెంట్గా ఉన్న అచ్యుత్రావు కూతురు అంజలిని చూడగానే అతని బ్యాల్యం గుర్తొస్తుంది. ఆమె అమాయకంగా ‘మా నాన్నకు అలా ఎందుకైంది’ అని ప్రశ్నించడం చూసి చలించిపోతాడు.
చిన్నారి ప్రశ్నకు సమాధానం చెప్పాలకుంటాడు. మూడు రోజుల తర్వాత అచ్యుత్ తరహాలోనే విక్రాంత్ అనే వ్యక్తి కూడా మరణిస్తాడు. అయితే ఇవన్నీ ప్రమాదవశాత్తు జరిగిన మరణాలే అని పోలీసులు నిర్ధారణకు వస్తారు. కానీ ఏసీపీ సీత(రెబా మోనికా జాన్) మాత్రం ఈ మరణాల వెనుక ఏవైనా రహస్యాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ మొదలుపెడుతుంది. అవి ప్రమాదాలు కావని హత్యలని జయ్ తెలుసుకుంటాడు. ఈ విషయాన్ని ఏసీపీ సీతతోనూ చెబుతాడు. కానీ ఆధారాలు లేకపోవడంతో ఆమె పట్టించుకోదు. జయ్ మాత్రం ఈ హత్యల వెనుక ఉన్నదెవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తాడు.నిజంగానే జయ్ చెప్పినట్టుగా అవి హత్యలేనా? ఎవరు చేసారు? ఎందుకు చేశారు? హంతకుడిని కనిపెట్టే క్రమలో జయ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.ఇలాంటి సినిమాలకు తర్వాత ఏం జరుగుతుందో తెలియని విధంగా బలమైన స్క్రీన్ప్లేతో పాటు ఆడియన్స్ని కట్టిపడేసేలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఈ రెండూ ‘మృత్యుంజయ్’లో ఉన్నాయి.కానీ సినిమా చూస్తున్నంత సేపు కొన్ని ఫారిన్ చిత్రాలతో పాటు ‘అతడు’, ‘జులాయి’లాంటి సినిమాలలోని కొన్ని సన్నివేశాలు మన కళ్ల ముందు కదులుతాయి. ఆ చిత్రాల్లోలాగే ఇందులో కూడా హీరో-విలన్ ఇద్దరూ తెలివైనవాళ్లే. ఎత్తుకుపైఎత్తులు వేస్తూ టామ్ అండ్ జెర్రీ దాగుడు మూతలాటలాగా కథనం సాగుతుంది. హీరో-విలన్ ఇద్దర్ని తెలివైనవాళ్లలాగా చూపించి.. లాజిక్స్ని పట్టించకోకుండా కథనాన్ని నడిపించడమే కాస్త సిల్లీగా అనిపిస్తుంది.
హీరో పాత్ర ఎంట్రీ మొదలు..ఇన్వెస్టిగేషన్ వరకు ఎక్కడా కూడా నేచురల్గా అనిపించదు. శ్రద్ధాంజలి యాడ్స్ కోసం హీరో గెటప్లు మారుస్తూ వెళ్లడం.. అది కూడా ఒక ప్రముఖ పత్రికలో పని చేస్తూ.. ఇది వినడానికే కాదు తెరపై చూడడానికి కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అలాగే సినిమా ప్రారంభంలో జరిగే రెండు హత్యలకు సంబంధించిన క్లూస్ కోసం హీరో చేసే ప్రయత్నాలు కూడా అంతగా మెప్పించవు. కానీ ఆ క్లూస్తో హీరో చేసే ఇన్వెస్టిగేషన్ కొతవరకు ఆసక్తిని పెంచుతుంది.
విలన్ని పట్టుకునేందుకు హీరో వేసే ఎత్తులు సినిమాటిక్గా, పేలవంగా ఉన్నాయి. ఆ సీన్లను మరింత బలంగారాసుకొని ఉంటే బాగుండేది. అయితే క్లైమాక్స్లో విలన్ని అంతం చేయడానికి హీరో వేసిన ప్లాన్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్, సుకుమార్ శిష్యుడు కావడంతో.. స్క్రీన్ప్లే కూడా ఆయన సినిమాల్లోలాగే సాగుతుంది. కామెడీ సీన్లు, ఐటెమ్ సాంగులు, లవ్ ట్రాకులను పెట్టకుండా అసలు కథను మాత్రమే చెప్పడం సినిమాకు ప్లస్ అయింది. ఎక్కడ బోర్ కొట్టదు కానీ.. కొత్త సినిమా చూశామనే ఫిలింగ్ మాత్రం కలగలదు.
ఎవరెలా చేశారంటే..
కామెడీ.. శ్రీవిష్ణు బలం. కానీ ఈ సారి తనలోని కొత్త కోణాన్ని పరిచయం చేశాడు. సీరియస్ క్యారెక్టర్లోనూ నటించగలనని జయ్ పాత్రతో నిరూపించాడు. ఆయన లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, హావభావాలు అన్నీ కొత్తగా ఉంటాయి. విలన్గా వీర్ ఆర్యన్ అదరగొట్టేశాడు. రెబా మోనికాది రెగ్యులర్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. సుదర్శన్, ఐశ్వర్య, రచ్చ రవి, చిన్నా, బాలాదిత్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ నేపథ్య సంగీతం బాగుంది, శ్రీకర్ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
-అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్


