టైటిల్: ఎస్. సరస్వతి
నటీనటులు: వరలక్ష్మీ శరత్కుమార్, ప్రకాశ్ రాజ్, జీవా, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమని, సప్తగిరి తదితరులు
నిర్మాతలు:పూజా శరత్ కుమార్, వరలక్ష్మి శరత్ కుమార్
కథ: సాయిమాధవ్ బుర్రా
దర్శకత్వం: వరలక్ష్మి శరత్కుమార్
సంగీతం: తమన్
సినిమాటోగ్రఫీ: ఎడ్విన్ సకాయ్
విడుదల తేది: మార్చి 6, 2026

కథేంటంటే..
లక్ష్మి(వరలక్ష్మి శరత్కుమార్) సింగిల్ మదర్. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్స్గా పని చేస్తుంది. కూతురు సరస్వతి(నివేక్ష) తప్ప ఆమెకు మరో లోకం ఉండదు. ఆగస్ట్ 15న కూతురు పుట్టినరోజు కావడంతో చాక్లెట్ బాక్స్ ఇచ్చి స్కూల్లో డ్రాప్ చేస్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి స్కూల్లో కూతురు కనిపించదు. సిబ్బందిని ప్రశ్నిస్తే.. సరస్వతి అనే పేరుతో ఆమె చెప్పిన క్లాస్లో ఏ అమ్మాయి లేరని చెబుతారు. పోలీసులు కూడా ఫిర్యాదు తీసుకోరు. అదేరోజు రాత్రి స్కూల్ నుంచి లక్ష్మికి ఓ ఫోన్ వస్తుంది. తాను ప్రిన్సిపల్ రూమ్ లోనే ఉన్నానని, తనతో పాటు ఇంకో ఇద్దరు అంకుల్స్ కూడా ఉన్నారని,వాళ్ళని చూస్తే భయమేస్తుందని సరస్వతి చెబుతుంది. లక్ష్మి అక్కడికి వెళ్లి చూడగా.. కూతురు అత్యాచారానికి గురై చనిపోతుంది. అదేరాత్రి కూతురు శవాన్ని శ్మశానంలో పాతిపెట్టి..ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది.
అయితే సీఐ కృష్ణారెడ్డి(మురళీ శర్మ) మాత్రం సాక్ష్యం ఉంటేనే కేసు ఫైల్ చేస్తానంటూ.. శవం కోసం లక్ష్మి చెప్పిన ప్రదేశంలో తవ్వి చూస్తారు. కానీ అక్కడ పాప శవం లభించదు. ఏ సాక్ష్యాలు లేవని పోలీసులు కేసు నమోదు చేయరు. దీంతో లక్ష్మి కోర్టుని ఆశ్రయిస్తుంది. న్యాయవాది రామానుజం (ప్రకాశ్ రాజ్)ఆమెకు తోడుగా నిలుస్తాడు. ఎలాంటి సాక్ష్యాలు లేని ఈ కేసులో రామానుజం విజయ సాధించాడా? అసలు లక్ష్మి ఎవరు? ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? సరస్వతిపై అత్యాచారానికి పాల్పడిందెవరు? పాఠశాల యాజమాన్యం వారికి ఎందుకు తోడుగా నిలిచింది? కేసు విచారణ క్రమంలో రామానుజానికి తెలిసిన అసలు నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్ల పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఇలాంటి సినిమాల్లో థ్రిల్ ఎలిమెంట్స్తో పాటు ట్విస్టులు కూడా ఊహించని విధంగా ఉండాలి. అప్పుడే సినిమా రక్తి కట్టిస్తుంది. కానీ ‘సరస్వతి’లో అది మిస్ అయింది. సినిమా ప్రారంభం అయినా కాసేపటికే.. పాపకు సంబంధించిన ఓ ట్విస్టు ఈజీగా తెలిసిపోతుంది. అదొక్కటే కాదు.. సైకలాజికల్ థ్రిల్లర్స్ రెగ్యులర్గా చూసేవాళ్లకి సినిమాలోని ప్రతి ట్విస్ట్ ఊహించొచ్చు. అలాగే కథా నేపథ్యం కూడా వరలక్ష్మి నటించిన ‘శబరి’, ఇటీవల వచ్చిన ‘త్రిభాణధారి బార్బరిక్’ తో పాటు పలు పాత చిత్రాలను గుర్తుకు తెస్తుంది. అయినా కూడా తల్లి కూతుళ్ల ఎమోషన్ మాత్రం కాస్త భావోద్వేగానికి గురి చేస్తుంది.
తల్లి కూతుళ్ల బాండింగ్ తెలియజేసే పాటతో సినిమా ప్రారంభం అవుతుంది. పాపను స్కూల్లో డ్రాప్ చేయడం.. సాయంత్రానికి కనిపించకుండా పోవడం..అక్కడ లక్ష్మి చేసే హడావుడి అంతా ఆసక్తికరంగానే సాగుతుంది. అయితే ఎలాంటి సాక్ష్యాలు కనిపించకుండా పోవడంతో అసలు పాప ఉందా లేదా? ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. కానీ కాసేపటికే ఆ ఆసక్తి కాస్త నీరసంగా మారిపోతుంది. ట్విస్టుతో పాటు కథనం మొత్తం ఊహకందేలా సాగుతుంది. ప్రకాశ్ రాజ్ పాత్ర రంగంలోకి దిగిన తర్వాత మళ్లీ కథపై ఆసక్తి పెరుగుతుంది. కోర్టు విచారణ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. లక్ష్మి నేపథ్యం.. ఆమెకు జరిగిన అన్యాయం.. ఇవన్నీ కాస్త ఆసక్తిగానే అనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ సీన్తో ద్వితియార్థం మొత్తం ఊహించొచ్చు. కమర్షియల్గా ఏ మేరకు ఆడుతుందో తెలియదు కానీ..ఈ సినిమా ద్వారా ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది.

ఎవరెలా చేశారంటే..
వరలక్ష్మి నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ పాత్రలో అయినా జీవించేస్తుంది. లక్ష్మి పాత్రలో కూడా ఆమె చక్కగా నటించింది. నిజాయితీ గల న్యాయవాధి రామానుజంగా ప్రకాశ్ రాజ్ బాగానే నటించాడు. అయితే కోర్టు రూం డ్రామా సన్నివేశాలు మాత్రం అంతగా రక్తి కట్టించలేదు. ప్రియమణి, కిశోర్ పాత్రలు తెరపై కనిపించేది తక్కువసేపే అయినా గుర్తిండిపోతాయి. నాజర్, రావు రమేశ్, సప్తగిరి, రాధికా శరత్కుమార్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.
సాంకేతికంగా సినిమా బాగుంది. తమన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు వినసొంపుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్


