
ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ తాజాగా క్లీమ్ ప్రొడక్షన్స్తో కలిసి పన్నెండేళ్ల ప్రణాళికతో మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) అనే ప్రాజెక్ట్ ప్రారంభించింది. ఈ యూనివర్స్లో భాగంగా రానున్న తొలి చిత్రం ‘మహావతార్ నరసింహ’. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయి, చైతన్య దేశాయి నిర్మించారు. ఈ చిత్రం 3డీ ఫార్మాట్లో ఐదు భాషల్లో జూలై 25న రిలీజ్ కానుంది. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘రోర్ ఆఫ్ నరసింహ...’ పాటను రిలీజ్ చేశారు. సామ్ సీఎస్, రాకేందు మౌళి సాహిత్యం అందించి, పాడారు.
ఈ సందర్భంగా అశ్విన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఇది కేవలం సినిమా కాదు... ఆధ్యాత్మిక అనుభూతి’’ అన్నారు. ‘‘ఇప్పుడు మన కథలు వెండితెరపై అలరించబోతున్నాయి. ఇదో అద్భుతమైన సినిమా ప్రయాణం’’ అని శిల్పా ధవాన్ తెలిపారు. ఇదిలా ఉంటే... ఎంసీయూ దశావతారాలను తెరపైకి తీసుకొస్తుంది. 2025లో నరసింహ, 2027లో పరశురామ, 2029లో రఘునందన్, 2031లో ద్వారకాధీశ్, 2033లో గోకులానంద, 2035లో మహావతార్ కల్కి పార్ట్ 1, 2037లో మహావతార్ కల్కి పార్ట్ 2 ’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు.