కాజల్ అగర్వాల్, శ్రేయాస్
వ్యవసాయంలో పురుగుల మందు వినియోగం వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న తీవ్ర ప్రభావాలను ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చేతన్ డీకే రూపొందించిన సినిమా ‘ది ఇండియా స్టోరీ’. ‘స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్’ అన్నది ఈ సినిమా ఉపశీర్షిక. కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ఈ చిత్రంలోని ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్ సమర్పణలో చేతన్ సాగర్ బి. షిండే నిర్మించిన ఈ సినిమా జూలై 24న విడుదల కానుంది.
శుక్రవారం ఈ సినిమా టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘ప్రతి మూడు కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్తో పోరాడుతున్నారు, ప్రతి అరవై సెకన్లకు ఒకరు లేదా ఇద్దరు చనిపోతున్నారు’’ అంటూ డైలాగ్స్ లేకుండా కొన్ని నంబర్స్ను ఈ టీజర్లో చూపించారు. వ్యవసాయరంగంలో జరుగుతున్న కల్తీ, ప్రజలు తీవ్ర అనారోగ్యాల బారిన పడటం, వ్యవసాయ రంగంలో వినియోగించే మందుల తయారీలో ఆయా కంపెనీల నిర్లక్ష్యం వంటి అంశాలను ఈ సినిమాలో చర్చించినట్లుగా విడుదలైన టీజర్ స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ లాయర్ పాత్రలో నటించారు.


