చెల్లి పెళ్లి అంటూ ఆ హీరో రూ.10 లక్షలు తీసుకున్నాడు, చివరికి ముఖం చాటేశాడు: దర్శకుడు
కేరళలో రిలీజైన '2018- ఎవ్రీవన్ ఈజ్ ఎ హీరో' సినిమా అక్కడ హిట్ టాక్తో దూసుకుపోతోంది. ఈ మలయాళీ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ జ్యూడ్ ఆంథొని జోసెఫ్ గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'కొన్నివిషయాలను అంత ఈజీగా మర్చిపోలేం. షేన్ నిగమ్, శ్రీనాథ్ బసి లాంటివాళ్లు గంజాయి, డ్రగ్స్కు బానిసయ్యారన్న ఆరోపణలున్నాయి. కానీ నా దృష్టిలో డ్రగ్స్ కన్నా మానవత్వం లేకపోవడమే అతి పెద్ద సమస్య. ఇండస్ట్రీలో ఆంటోని వర్గీస్ అనే వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా మంచి వాడని అందరూ అనుకుంటారు.
నేనూ అలాగే అనుకున్నా. నిర్మాతగా అతడితో ఓ సినిమా చేయాలనుకున్నాను. అతడు కూడా ఓకే చెప్పాడు. ఇంతలో తన చెల్లెలి పెళ్లి అని చెప్పి సహనిర్మాత, నా స్నేహితుడు అరవింద్ నుంచి రూ.10 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. సినిమా ప్రారంభించడానికి ఇంకా 18 రోజులు ఉందన్న సమయంలో అతడు ముఖం చాటేశాడు. నాకు, అరవింద్కు చాలా బాధేసింది. ఇద్దరం ఎంతగానో ఏడ్చాం. మా సినిమా చేయనని చెప్పి నహస్ హిదయత్ అనే కొత్త దర్శకుడితో అరవం సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
కానీ కొంతకాలానికే ఆ సినిమా అటకెక్కింది. బహుశా అతడు చేసిన పాపం అతడికే చుట్టుకుందేమో! చాలా కాలం తర్వాత తను తీసుకున్న డబ్బును అరవింద్కు తిరిగిచ్చాడు వర్గీస్. చాలామంది అర్హత లేని వ్యక్తులు ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో వర్గీస్ ఒకడు. డైరెక్టర్ లిజో జోస్ పెల్లిసరీ అతడిని ఇండస్ట్రీకి పరిచయం చేయకపోతే ఇలాంటి వాళ్లను భరించాల్సిన అవసరమే ఉండేది కాదు' అని ఎమోషనలయ్యాడు జ్యూడ్.