సిగ్గుండాలి అంటూ సందీప్‌ రెడ్డి వంగాపై విరుచుకుపడిన స్టార్‌ రైటర్‌ | Sakshi
Sakshi News home page

సిగ్గుండాలి అంటూ సందీప్‌ రెడ్డి వంగాపై విరుచుకుపడిన జావేద్‌ అక్తర్‌

Published Sun, Mar 17 2024 10:38 AM

Javed Akhtar Reacts To Sandeep Reddy Vanga Comments - Sakshi

టాలీవుడ్‌ డైరెక్టర్‌ సందీప్ రెడ్డి వంగాపై ప్రముఖ స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్ మరోసారి కామెంట్లు చేశారు. యానిమల్‌ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రేక్షకులను గతంలో తప్పుబట్టిన జావేద్‌కు సందీప్‌ రెడ్డి వంగా కూడా కౌంటర్‌ ఇచ్చారు. జావేద్‌ అక్తర్‌ కుమారుడు ఫర్హాన్ నిర్మించిన మీర్జాపూర్ వెబ్ సిరీస్‌ను తెరపైకి తీసుకొచ్చి సందీప్‌ కూడా కడిగిపారేశారు. అంతా సద్దుమనిగింది అనుకుంటే తాజాగా మళ్లీ జావేద్ అక్తర్ ఇదే అంశంపై రియాక్ట్‌ అయ్యారు. సందీప్‌ రెడ్డి వంగాపై ఆయన పలు కామెంట్లు చేశారు.

యానిమల్ చిత్రాన్ని తీసిన డైరెక్టర్‌ను తాను ఏమీ అనలేదని జావేద్‌ అక్తర్‌ క్లారిటీ ఇచ్చారు. అది రాజ్యాంగం అతనికి ఇచ్చిన హక్కు అని.. అయితే ప్రేక్షకుల గురించే తనకు ఆందోళన అని అక్తర్ పేర్కొన్నారు. 'నేను ఫిల్మ్ మేకర్‌ను ఏమాత్రం నిందించలేదు. ప్రజాస్వామ్య సమాజంలో ఒక యానిమల్ చిత్రమే కాదు.. అలాంటివి ఎన్నో సినిమాలు తీసే హక్కు అతనికి ఉంది. కానీ నా ఆందోళనంతా ప్రేక్షకుల గురించి మాత్రమే.. ఈ సమాజంలో పరిమితి మేరకు ఎలాంటి సినిమా అయినా చేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. నేను యానిమల్‌ చిత్రాన్ని చూడలేదు. కొందరు మిత్రులు షేర్‌ చేసిన దానిని బట్టి యానిమల్‌ చిత్రంపై కామెంట్లు చేశాను.' అని జావేద్‌ అన్నారు.

'నా వ్యాఖ్యలకు సందీప్‌ రెడ్డి కూడా స్పందించడం నాకు గౌరవంగా అనిపించింది. నా 53 ఏళ్ల కెరీర్‌లో ఒక్క సినిమా, ఒక్క స్క్రిప్ట్, ఒక్క సీన్, ఒక్క డైలాగ్, ఒక్క పాటలో కూడా ఆయన అసభ్యత, తప్పును కనిపెట్టలేకపోయారు. ఇక చేసేది ఏమీ లేకపోవడంతో  నా కుమారుడి ఆఫీస్ నిర్మించిన మీర్జాపూర్‌ వెబ్‌ సిరీస్‌ను పట్టుకున్నారు. అందులో ఫర్హాన్ నటించలేదు, డైరెక్ట్ చేయలేదు. రాయలేదు. కేవలం అతని కంపెనీ ఎక్సెల్ మీడియా ప్రొడ్యూస్ చేసింది. ఆ సంస్థ నుంచి చాలా సిరీస్‌లు వచ్చాయి. అందులో ఇదీ ఒకటి. దాన్నే అతడు పట్టుకున్నారు. దాని వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. నా 53 ఏళ్ల కెరీర్‌లో ఒక్క తప్పు కూడా వెతకలేకపోయావా.. చేసేది ఏమీ లేక నా కుమారుడి దగ్గరకు పోయావా సందీప్‌.. ఇదీ సిగ్గుచేటు.' అని జావెద్ అక్తర్ ఘాటుగా స్పందించారు. 

గతంలో జావేద్‌ అక్తర్‌పై సందీప్‌ చేసిన కామెంట్లు
యానిమల్‌ డైరెక్టర్‌ సందీప్‌ వంగాపై గతంలో ప్రముఖ రచయిత జావేద్‌ అక్తర్‌ పరోక్షంగా విమర్శించారు. యానిమల్‌ సినిమా చాలా ప్రమాదకరం అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో సందీప్‌ వంగా ఓ ఇంటర్వ్యూలో ఇలా రియాక్ట్‌ అయ్యాడు. 'సలహాలు ఇవ్వాల్సింది నాకు కాదు. ముందుగా మీ కుమారుడు  ఫర్హాన్‌ అక్తర్‌కు ఇవ్వాలి. మీ కుమారుడు నిర్మించిన మీర్జాపుర్‌ సిరీస్‌లో ప్రపంచంలో ఉన్న బూతులన్ని అందులోనే ఉన్నాయి. ఇప్పటికి కూడా నేను ఆ సిరీస్‌ను పూర్తిగా చూడలేదు కానీ కొన్ని సీన్స్‌ చూస్తేనే వాంతి కలిగినట్లు ఉంటుంది. కాబట్టి ముందుగా జావేద్‌అక్తర్‌ తన కుమారుడు నిర్మించే చిత్రాలపై శ్రద్ధ పెట్టడం మంచిది.' అని సందీప్‌ తెలిపాడు. 

Advertisement
Advertisement