Raja Raja Chora : పబ్లిసిటీ కోసం అలా మాట్లాడలేదు : శ్రీవిష్ణు

Hero Sree Vishnu Exclusive Interview on Raja Raja Chora Movie - Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌: రాజ  శ్రీవిష్ణు హీరోగా మేఘా ఆకాశ్, సునైన హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజ రాజ చోర’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శ్రీవిష్ణు. ఆయన చెప్పిన సంగతులేంటో చదివేయండి.

అలాంటి వారికి ఇది రైట్‌ సినిమా
ఇది కొత్త స్టోరీ. ఇందులో నేను దొంగ. పెద్ద స్కామ్‌ చేసే దొంగ కాదు. కొంటె దొంగని. 10 నిమిషాల్లోనే సినిమా క్యారెక్టర్లు అన్ని తెలిసిపోతాయి. ఆ తర్వాత నా క్యారెక్టర్‌  చుట్టూ కథ తిరుగుంది. మనం ఓటీటీలో ఇతర భాషల సినిమాలను చూసి పొగిడేస్తున్నాం కదా? అలాంటి వారికి ఇది రైట్‌ సినిమా. మన తెలుగు వాళ్లు ఈ జానర్‌లో చేసిన తొలి సినిమా ఇది. కచ్చితంగా అందరికి కనెక్ట్‌ అవుతుంది. 

కథే అలా మాట్లాడించింది
ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అంత ఎమోషనల్‌గా మాట్లాడానికి కారణం ‘రాజ రాజ చోర’కథే. నిజంగా ఈ కథ బాగా కుదిరింది. స్టోరీని ఎక్కువగా రివీల్‌ చేయడానికి వీల్లేదు. పబ్లీసిటీ కోసం అయితే అలా మాట్లాడలేదు. కథ గురించి చెప్పేసి.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి నిరుత్సాహపరచడం నాకు ఇష్టం ఉండదు. నా కథ, షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ని మాత్రమే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో చెప్తా. ఇందులో సిద్‌ శ్రీరామ్‌ ఓ పాట పాడారు. ఆ విషయం ఎక్కడా చెప్పలేదు. ఎందుకంటే థియేటర్లకు వచ్చిన తర్వాత ఆ సాంగ్‌ వింటేనే ఓ ఫీల్‌ కలుగుతుంది. అందుకే పబ్లిసిటీ కోసం వాడకుండా.. నిజాయతీగా సినిమాను థియేటర్‌లోకి తీసుకొస్తున్నాం. సాధార‌ణంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్‌కు రావ‌డానికి ఆలోచిస్తుంటారు. అలాంటి భ‌యానికి ముందు నా కాన్ఫిడెన్స్‌ని ప్రెజంట్ చేస్తే బావుంటుంద‌నిపించి స్టేజ్‌పై అలా మాట్లాడాను. అయితే నేను చెప్పిన మాట‌లు హృద‌యంలో నుంచి వ‌చ్చిన‌వే. 

టార్గెట్‌ పెట్టుకొని వెంకటేశ్‌ని కలిశా
నేను వెంకటేశ్‌కు చాలా పెద్ద అభిమానిని. నటుడిగా మారాక ఆయనను కలిసే అవకాశం వచ్చినప్పటికీ కలవలేదు. మంచి సినిమాలు చేసి ఆయన నుంచి పిలుపు వచ్చే వరకు కలవొద్దని చిన్న టార్గెట్‌ పెట్టుకున్నాను. లక్కీగా ‘నీదీ నాదీ ఒకే కథ’తర్వాత వెంకటేశ్‌ నుంచి పిలుపు వచ్చింది. వెళ్లి కలిశా.. చాలా బాగా చేస్తున్నావని అభినందించారు. కథలు ఎంచుకునే విషయంలో డౌట్స్‌ ఉంటే ఆయన సలహాలు తీసుకుంటాను. ప‌ర్స‌న‌ల్‌గా నాక‌వి ఎంతో హెల్ప్ అవుతూ వ‌చ్చాయి.  ‘రాజా రాజ చోర’ట్రైలర్‌ విడుదలైన వెంటనే.. ఫోన్‌ చేసి కామెడీ బాగుందని చెప్పారు. తాజాగా ఆయన ఇచ్చిన సలహా ఏటంటే.. అన్ని జానర్స్‌లో బాగా చేస్తున్నావు. మాస్‌ జానర్‌ కూడా ట్రై చేయమని చెప్పారు. లక్కీగా నేను తర్వాత చేయబోయే సినిమాలన్నీ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలే. అవి మాస్‌ ఆడియన్స్‌ని తప్పకుండా అలరిస్తాయి. 

పాన్‌ ఇండియా చిత్రమే
నా గత సినిమాలన్నీ ఇతర భాషల్లో రిమేక్‌ చేశారు. కానీ ఎక్కడా చెప్పలేదు. రాజ రాజ చోర  కచ్చితంగా ఇతర భాషల్లో రీమేక్‌ అవుతుంది. పాన్‌ ఇండియా స్టఫ్‌ ఉన్న సినిమా ఇది. 

కొత్త దర్శకులతో ఈజీ
హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుల‌తో ప‌నిచేస్తే రిలాక్స్ అయిపోతాం. అలా ఉండ‌టం నాకిష్ట‌ముండ‌దు. కొత్త దర్శకులతో చేసేటప్పుడు  భ‌యం, బాధ్య‌త ఉంటాయి. హ్యాండిల్ చేస్తార‌ని న‌మ్మ‌కం వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు బిడ్డ‌లాగే భావించే సినిమా క‌రెక్ట్ వస్తుంటే వాళ్లు ప‌డే ఆనందం చూస్తే నాకొక కిక్ వ‌స్తుంది. ఫ‌స్ట్ నుంచి నాకు అలా అల‌వాటైంది. అంతేకాకుండా కొత్త వాళ్లతో సినిమా చేయడం కిక్‌. వాళ‍్లతో సినిమా చేస్తే మన బుర్ర కూడా పదునెక్కుతుంది. నా సినిమాల్లో ఎక్కువగా కొత్తవాళ‍్లతో చేసినవే హిట్‌ అయ్యాయి. ఈ సినిమా చూసిన త‌ర్వాత ముందు మ్యూజిక్ డైరెక్ట‌ర్ వివేక్ సాగ‌ర్ గురించే మాట్లాడుతారు. 

తొలిసారి ఇద్దరితో
తొలిసారి ఇద్దరు హీరోయిన్లు మేఘా ఆకాశ్, సునైనతో సినిమా చేశా. ఇద్దరు తెలుగు వాళ్లే. కానీ తమిళంలో ఎక్కువ సినిమాలు చేశారు. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్‌ వస్తాయనే నమ్మకముంది.

ప్రేక్షకుల మనసును దోచుకుంటా
సినిమా జయా, అపజయాలు నా చేతుల్లో ఉండవు. కష్టపడి సినిమాలు చేస్తాం.. కొన్ని కారణాల వల్ల ఫెయిల్‌ అవుతుంటాయి. ఏ కారణాల వల్ల సినిమా పోయిందో చూసుకొని తదుపరి సినిమాల్లో తప్పిదాలు లేకుండా చూసుకుంటా. ప్రస్తుతం అర్జున పాల్గుణ, భళా తందనాన సినిమాలతో పాటు కాప్‌ బయోపిక్‌ చేస్తున్నా. ‘రాజ రాజ చోర’తో ప్రేక్షకుల మనసును కచ్చితంగా దోచుకుంటాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top