
ట్రైలర్లో కనిపిస్తున్నట్లుగా హీరో ఎందుకు భయపడుతుంటాడు? కథలోని అందర్నీ ఎందుకు అతిథిలుగా భావిస్తుంటాడు?..
ఆది సాయికుమార్, సువేక్ష జంటగా పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వంలో మిర్యాల రాజాబాబు, మిర్యాల అశోక్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పొలిమేర నాగేశ్వర్ మాట్లాడుతూ – ‘‘చోడవరం దగ్గర బోగాపురం స్వస్థలం. చదువుకునే రోజుల్లోనే సినిమాలు, నాటకాల పట్ల ఆసక్తి ఉండేది. బీటెక్ పూర్తి చేసి, సినిమాలపై ఉన్న ఆసక్తితో హైదరాబాద్ వచ్చాను.
దర్శకులు కె. విశ్వనాథ్, వీవీ వినాయక్, రాజమౌళి వంటి వారి వద్ద దర్శకత్వ శాఖలో చేశాను. దర్శకుడిగా ‘అతిథి..’తో నాకు రాజాబాబు, అశోక్ అవకాశం ఇచ్చారు. లవ్.. యాక్షన్.. థ్రిల్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. ట్రైలర్లో కనిపిస్తున్నట్లుగా హీరో ఎందుకు భయపడుతుంటాడు? కథలోని అందర్నీ ఎందుకు అతిథిలుగా భావిస్తుంటాడు? అనేవి హైలైట్గా ఉంటాయి. ఇప్పటికే నా దగ్గర చాలా రకాల కథలు ఉన్నాయి. తర్వాతి ప్రాజెక్ట్ గురించి త్వరలో చెబుతాను’’ అన్నారు.