విదేశాల్లో 'ధురంధర్ 2' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మన దేశంలో మాత్రం జూన్ 4వ తేదీ సాయంత్రం నుంచి హాట్స్టార్లో అందుబాటులోకి రానుందని అధికారికంగానే ప్రకటించారు. అయితే ఈ మూవీ అంతా పాక్లోని లయరీ ప్రాంతంలో జరిగే గ్యాంగ్ వార్స్, రాజకీయాలు, ఉగ్రవాద చర్యలు తదితర అంశాల ఆధారంగా తీశారు. దీంతో పాక్తో పాటు అరబ్ దేశాల్లో దీనిపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రేక్షకులు ఎవరూ ఈ చిత్రాన్ని చూడలేకపోయారు.
(ఇదీ చదవండి: నాపై చేతబడి.. రక్తం వాంతులు, నరకం చూశా : జయం రవి)
అయితే 'ధురంధర్ 2' థియేటర్లలో రిలీజైన తర్వాత పైరసీని పాక్లో విపరీతంగా చూశారు. అక్కడి కరెన్సీలో రూ.50కే ప్రింట్ అమ్మారు. ఇప్పుడు అధికారికంగా దాయాది దేశంలో ఓటీటీలోకి వచ్చేసింది. వచ్చిన మరుక్షణం నుంచే ఓటీటీ సర్వర్ క్రాష్ అయిందని, అలానే గడిచిన 24 గంటల నుంచి తమ దేశంలో నం.1 ట్రెండింగ్లో ఉందని పాక్ ఇన్ఫ్లూయెన్సర్ చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
'ధురంధర్ 2 పాకిస్తాన్లో ఇప్పుడే రిలీజైంది. సర్వర్స్ క్రాష్ అయ్యాయి. పాకిస్థానీలు అర్థరాత్రి ఎప్పుడవుతుందా? నెట్ఫ్లిక్స్లోకి ఎప్పుడొస్తుందా అని చూశారు. రాగానే క్లిక్ చేశారు. అందుకే మూవీ ప్లే కావడానికి టైమ్ పడుతోంది. అంతలా క్రేజ్ సంపాదించుకుంది. అయితే సినిమాలో చూపించింది నిజమా అబద్దమా అనేది వేరే విషయం. కానీ పాకిస్థానీలు మాత్రం మూవీ ఎలా తీసుంటారా అని చూసేందుకు ఎగబడుతున్నారు. రణ్వీర్ సింగ్ పాత్ర ఏంటనేది అందరికీ తెలుసు. లయరీలో అలా జరిగింది లేదా అనేది తర్వాత మాట్లాడుదాం' అని సదరు ఇన్ఫ్లూయెన్సర్ చెప్పుకొచ్చాడు.
'ధురంధర్' రెండు భాగాలుగా రిలీజైంది. తొలి పార్ట్ గతేడాది డిసెంబరులో, సీక్వెల్ ఈ ఏడాది మార్చిలో థియేటర్లలోక వచ్చింది. మొత్తంగా రూ.3000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. జస్కీరాత్ సింగ్ అనే వ్యక్తి.. హంజా అలీ మజారీ అనే మారుపేరుతో పాకిస్తాన్లోకి గూఢచారిగా వెళ్లి.. అక్కడ మాఫియాని, భారత్కి చేటు చేసిన పలువురు ఉగ్రవాదుల్ని ఎలా అంతం చేశాడనే స్టోరీతో ఈ సినిమా తీశారు. రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్, సారా అర్జున్ కీలక పాత్రలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకుడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా)


