Dhanush : ఆకట్టుకుంటున్న ధనుష్‌ తిరుచిట్రంపళం.. ఆనందంలో అభిమానులు

Dhanush And Nitya Menen Thiruchitrambalam Movie Is Out Now - Sakshi

ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం తిరుచిట్రంపళం. హీరోయిన్లుగా నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియా భవానీ శంకర్‌ నటించిన ఈ సినిమాలో దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్, నటి రేవతి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం, ఓం ప్రకాష్‌ ఛాయాగ్రహణం అందించారు. మిత్రన్‌ ఆర్‌.జవహర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. సుమారు 16 నెలల తరువాత థియేటర్‌లో ధనుష్‌ చిత్రం విడుదలైంది.

ఇంతకుముందు ఈయన నటించిన రెండు చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదల కావడంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. కాగా ఈ తిరుచిట్రంపళం చిత్రం ఎలా ఉందంటే ధనుష్‌ అభిమానులు పండుగ చేసుకునే విధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా నాలుగు పాత్రల మధ్య జరిగే ఈ చిత్ర కథలో ధనుష్, నిత్యామీనన్, దర్శకుడు భారతీరాజా, ప్రకాష్‌రాజ్‌ పోటీపడి నటించారు. కుటుంబం, ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని దర్శకుడు ఎంతో అందంగా తెరకెక్కించారు.

చిత్రంలో భారతీరాజా కొడుకుగా ప్రకాష్‌రాజ్, ఆయన కొడుకుగా ధనుష్, పక్కింటి అమ్మాయిగా నిత్యామీనన్‌ నటించారు. ఇక ధనుష్‌ ప్రేమించే పాత్రల్లో నటి రాశిఖన్నా, ప్రియ భవాని శంకర్‌ నటించారు. ఎన్నో ఆసక్తికరమైన కథనంతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనిరుథ్‌ సంగీతం చిత్రానికి అదనపు బలాన్ని ఇచ్చింది. చిత్రం సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో ధనుష్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top