లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. స్టార్‌ హీరోల ఇళ్లపై కస్టమ్స్ దాడులు | Bhutan Luxury Car Smuggling: Customs Raids on Celebrities’ Homes in Kerala | Sakshi
Sakshi News home page

లగ్జరీ కార్ల స్మగ్లింగ్.. దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్లపై కస్టమ్స్ దాడులు

Sep 23 2025 1:32 PM | Updated on Sep 23 2025 2:09 PM

customs officers raid Dulquer Salmaan and Prithviraj Sukumaran home

భూటాన్ ద్వారా లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతిపై కొచ్చి కమిషనరేట్ ఆఫ్ కస్టమ్స్ (ప్రివెంటివ్)  కేరళ వ్యాప్తంగా భారీ దాడులను ప్రారంభించింది. సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, సీనియర్ అధికారులతో సహా వారి నివాసాల్లో రవాణ కస్టమ్స్ అధికారులు దాడులు చేశారు. ఇందులో భాగంగా కొచ్చిలోని నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan), పృథ్వీరాజ్ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)  ఇళ్లపై కూడా ఈ బృందం దాడులు చేశాయి.

'ఆపరేషన్ నమ్‌ఖోర్' (భూటాన్ భాషలో వాహనం)  పేరుతో ఈ ఆపరేషన్ కేరళ అంతటా కొచ్చి, తిరువనంతపురం, కోజికోడ్, మలప్పురం, కుట్టిపురం, త్రిస్సూర్‌తో సహా దాదాపు 30 ప్రదేశాల్లో ఏక కాలంలో దాడులు చేశారు.  భూటాన్ నుంచి  హై-ఎండ్ కార్లను అక్రమంగా భారత్‌లోకి  దిగుమతి చేసుకున్నట్లు కస్టమ్స్ అనుమానిస్తోంది. ఇందులో ల్యాండ్ క్రూయిజర్లు, ప్రాడో, ల్యాండ్ రోవర్లు వంటి లగ్జరీ SUVలు ఉన్నాయి.  భూటాన్‌లో మొదట రూ.5 లక్షల కంటే తక్కువ ధరకు  అక్కడ కొనుగోలు చేస్తారు. ఆపై కేరళ నంబర్‌ ప్లేట్‌తో రీమోడల్‌ చేసి  తిరిగి రూ.40 లక్షల వరకు అమ్ముతున్నట్లు తెలుస్తోంది. వాటి అసలు ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. ఈ క్రమంలో పన్ను వెగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

అయితే, ఈ వాహనాల్లో కొన్నింటిని మలయాళ నటులు కొనుగోలు చేశారని కస్టమ్స్ అనుమానిస్తోంది. ఈ క్రమంలోనే  దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇళ్లపై కూడా కస్టమ్స్‌ అధికారులు దాడులు చేశారు. అయితే, వారి వద్ద ఎలాంటి అక్రమ వాహనాలు లేవని కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. ఈ వాహనాల స్మగ్లింగ్‌ వెనుక హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక రాకెట్ ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వాహనాలను తెలిసి కూడా ప్రముఖులు ఎందుకు కొంటున్నారనేది విచారణలో తేలాల్సిన విషయం.

వివిధ నివేదికల ప్రకారం, భూటాన్ ఆర్మీ వాహనాలతో పాటు ఫారిన్‌ కార్లను వేలంలో తక్కువ ధరలకు విక్రయించి, కస్టమ్స్ సుంకాలు చెల్లించకుండా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాతనే ఈ దర్యాప్తు ప్రారంభమైంది. ఈ ఖరీదైన వాహనాలను హిమాచల్ ప్రదేశ్‌కు రవాణా చేసి, తాత్కాలిక చిరునామాలను ఉపయోగించి మొదట  నమోదు చేస్తారు. నటులు, వ్యాపార ప్రముఖులు సహా ప్రముఖ కొనుగోలుదారులకు అధిక ధరలకు వాటిని ప్లాన్‌ ప్రకారం విక్రయిస్తారు. ఈ వాహనాలను భూటాన్‌లో చట్టబద్ధంగా వేలం వేస్తున్నప్పటికీ, సరైన పన్ను లేకుండా భారతదేశంలో వాటిని దిగుమతి చేస్తున్నారు. సరైన ఆధారాలు లేని ఈ వాహనాల వల్ల భారత సెలబ్రిటీలకు కూడా చిక్క​లు తప్పవని చెప్పవచ్చు.
 

Advertisement
 
Advertisement
Advertisement