తన భార్యతో విడాకుల కోసం పోరాడుతున్న హీరో జయం రవికి మరో షాక్ తలిగింది. ఆయన అభ్యర్థనను మద్రాస్ హైకోర్ట్ తోసిపుచ్చింది. మధ్యంతర భరణం పిటిషన్కు సంబంధించిన విచారణ చేపట్టిన న్యాయస్థానం జయం రవికి షాకిచ్చింది. తనకు మరింత సమయం కావాలంటూ వేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనిపై కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని జయం రవికి సూచించింది.
కాగా.. గతేడాది ఏప్రిల్లో విడాకుల వివాదం మొదలైంది. ఆ తర్వాత ఆయన భార్య ఆర్తి రవి తమ పిల్లల పాఠశాల ఫీజులతో సహా మధ్యంతర భరణం చెల్లించలేదని ఆరోపిస్తూ కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్ తిరస్కరిండంతో ఆమె మద్రాస్ హైకోర్ట్ను ఆశ్రయించారు. దీనిపై రెండు వారాల్లోగా తగిన ఉత్తర్వులు జారీ చేయాలని కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది.
అయితే విచారణను పూర్తి చేయడానికి దిగువ న్యాయస్థానానికి ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని కోరుతూ జయం రవి మద్రాస్ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు గతంలో నిర్ధారించిన గడువును పొడిగించడానికి నిరాకరిస్తూ జయం రవి పిటిషన్ కొట్టేసింది. దీనిపై కుటుంబ సంక్షేమ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నటుడిని ఆదేశించింది. కాగా.. తన విడాకుల ప్రక్రియ పూర్తయ్యే వరకు సినిమాల్లో నటించేది లేదని ఇటీవలే చెన్నైలో జయం రవి ప్రకటించిన సంగతి తెలిసిందే.
మరోవైపు జయం రవి సినిమాల విషయానికొస్తే.. రాఘవ లారెన్స్, నివిన్ పౌలీ నటిస్తోన్న 'బెంజ్' చిత్రంలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా తాను తొలిసారిగా దర్శకత్వం వహిస్తోన్న చిత్రం 'యాన్ ఆర్డినరీ మ్యాన్'లోనూ నటిస్తున్నారు. ఇటీవలే 'కరతే బాబు' మూవీ చిత్రీకరణ పూర్తి చేశారు. అంతేకాకుండా 'జీనీ', 'బ్రో కోడ్' అనే చిత్రాలు కూడా ఆయన చేతిలో ఉన్నాయి.


