
ప్రముఖ నటి శ్వేతా మీనన్పై కేసు నమోదైంది. ఆమెపై కేరళ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్వేతా మీనన్పై కేరళకు చెందిన మార్టిన్ మేనచేరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఆర్థిక లాభాల కోసం అడల్ట్ చిత్రాలు చేస్తోందని ఫిర్యాదు దారుడు ఆరోపించారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తన ఆర్థిక లాభం కోసం అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని మార్టిన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో ఆమె మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూ వల్లే ఫిర్యాదు చేయడానికి కారణమన్నారు. డబ్బు కోసం తాను ఇలాంటి సినిమాలు చేయడానికి సిద్ధమేనని ఆమె చెప్పారని మార్టిన్ ఆరోపించారు. అడల్ట్ సినిమాల ద్వారా డబ్బులు సంపాదించడం ఐటీ చట్టం ప్రకారం తప్పు అని ఆయన పోలీసులను ఆశ్రయించారు. అయితే మొదట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. ప్రస్తుతానికి ఈ కేసుకు సంబంధించి శ్వేత మీనన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
కాగా.. శ్వేతా మీనన్.. 1991లో మలయాళ చిత్రం అనస్వరంతో తన నటనను ప్రారంభించింది. ఆ తర్వాత మలయాళ చిత్రాలతో పాటు పలు బాలీవుడ్, టాలీవుడ్ చిత్రాల్లోనూ కనిపించింది. టాలీవుడ్లో నాగార్జున నటించిన రాజన్న చిత్రంలో కనిపించింది. బాలీవుడ్లో అశోక, బంధన్, హంగామా, రన్, కార్పొరేట్, శాండ్విచ్, కిస్సే ప్యార్ కరూన్ లాంటి సినిమాల్లో నటించింది. ఆమె చివరిగా 2024లో విడుదలైన మలయాళ చిత్రం జాంగర్, వెబ్ సిరీస్ నాగేంద్రన్స్ హనీమూన్స్లో మెప్పించింది. ఇటీవలే ఎంకిలే ఎన్నోడు పారా అనే మలయాళ షోను కూడా శ్వేత హోస్ట్ చేసింది. మలయాళంలో రతినిర్వేదం, పలేరి మాణిక్యం, కలిమన్ను వంటి చిత్రాలలో తన నటనతో ఆకట్టుకుంది. సినిమాలతో పాటు ఆమె పలు వాణిజ్య ప్రకటనలు చేసింది.