
బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్(87) శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన గుండె సంబంధిత జబ్బుతో ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలీవుడ్లో ఆయన ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంతో పాటు నటించారు. దీంతో ఆయన్ను అందరూ 'భరత్ కుమార్' అని కూడా పిలుస్తారు.
ఉపకార్ (1967), పురబ్ ఔర్ పశ్చిమ్ (1970), క్రాంతి (1981) వంటి క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. దశాబ్దాలుగా భారతీయ సినిమాకు చేసిన అపారమైన కృషికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులతో కేంద్రప్రభుత్వం గౌరవించింది. సినిమాల నుంచి దూరం అయిన తర్వాత రాజకీయంగా ఆయన బీజేపీలో చేరారు. కానీ, ఎలాంటి పదవులు తీసుకోలేదు. మనోజ్ కుమార్ మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నారు.
ప్రధాని మోదీ సంతాపం
మనోజ్ కుమార్ మృతిపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్మీడియా ద్వారా సంతాపం తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమలో ఐకాన్గా ఉన్న మనోజ్ మరణ వార్త తననెంతో బాధించిందన్నారు. ఆయన తెరకెక్కించిన దేశభక్తి సినిమాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని మోదీ అన్నారు. మనోజ్ రచనలు తరతాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు. మనోజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ఎక్స్ ద్వారా మోదీ సానుభూతి తెలిపారు.