తన తొలి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న తమిళ యువ దర్శకుడు సుభాష్ కె రాజ్.. రెండో సినిమా అగ్ర కథానాయకుడితో చేయనున్నారని సమాచారం. బ్లాస్ట్ సినిమాతో హిట్ కొట్టిన ఈ యువ డైరెక్టర్ భారీ ఆఫర్ అందుకున్నట్టు కోలివుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. విలక్షణ నటుడు సియాన్ విక్రమ్ను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించున్నాడని తాజా అనధికార సమాచారం. ఆయనకు కథ వినిపించి, గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సుభాష్ కె రాజ్ చెప్పిన కథ విక్రమ్కు బాగా నచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయనతో సినిమా చేసేందుకు చియాన్ ఓకే అన్నారని సమాచారం.
దర్శకుడు, హీరో ప్రదీప్ రంగనాథం శిష్యుడైన సుభాష్ కే రాజ్ (Subash K. Raj).. బ్లాస్ట్ సినిమాతో దర్శకుడిగా వెండి తెరకు పరిచయమయ్యారు. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 76 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. తెలుగు డబ్బింగ్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఫస్ట్ మూవీలో మిస్.. సెకండ్ చాన్స్!
నిజానికి బ్లాస్ట్ సినిమాలో అర్జున్ పోషించిన పాత్రకు ముందుగా విక్రమ్నే అనుకున్నారట దర్శకుడు సుభాష్ కే రాజ్. అనివార్య కారణాలవల్ల తన మొదటి సినిమాలో విక్రమ్ నటించకపోయినా రెండో చిత్రంలో ఆయనను డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నాడని కోలివుడ్లో టాక్ నడుస్తోంది. తన రెండో సినిమాకు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రానికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన ధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని టాక్.
చదవండి: నటుడు మాధవన్ గాయబ్.. ఫొటో వైరల్!
63వ చిత్రంలో విక్రమ్
వీరధీర సూరన్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్న హీరో విక్రమ్ చిన్న బ్రేక్ తీసుకొని తాజాగా తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇంతకుముందు వీరి కాంబినేషన్లో వచ్చిన ఇరుముగన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఆనంద్ శంకర్ సినిమా తర్వాత సుభాష్ కె రాజ్ డైరెక్షన్లో విక్రమ్ నటిస్తారని సమాచారం.


