
‘పేపర్ బాయ్’ఫేం జయశంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘అరి’. ‘మై నేమ్ ఈజ్ నో బడీ’ అనేది ఉపశీర్షిక.వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయికుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఆర్వీ రెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మించిన ఈ మైథలాజికల్ థ్రిల్లర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్లో స్పీడ్ పెంచారు మేకర్స్.
ఇప్పటికే ఈ చిత్రాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మఠాధిపతులు, స్వామిజీలకు చూపించగా..వారంతా చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. ఈ తరం తప్పకుండా చూడాల్సిన సినిమా అని సూచించారు. ఇక తాజాగా ఈ చిత్రం థీమ్ సాంగ్ని విడుదల చేశారు మేకర్స్.
‘మషినేనా నువ్వు..ఏమై పోతున్నావ్.. మృగమల్లే జారీ..దిగజారిపోయావ్’ అంటూ సాగే ఈ పాటకు వనమాలి లిరిక్స్ అందించగా.. షణ్ముఖ ప్రియ అద్భుతంగా ఆలపించింది. ఇక అనూప్ రూబెన్స్ తనదైన సంగీతంతో పాటను మరోస్థాయికి తీసుకెళ్లాడు. సినిమాలోని కీలక పాత్రలన్నింటిని పరిచయం చేస్తూ.. అసలు ఈ సినిమా కథేంటి? ఎం సందేశం ఇవ్వబోతుందనే విషయాలను తెలియజేలా థీమ్ సాంగ్ ఉంది. ఈ చిత్రంలో కృష్ణ తత్వాన్ని కొత్తగా చూపించామని చిత్రబృందం పేర్కొంది.