ఆర్వోబీ నిర్మాణానికి సహకరించాలి
ఆర్డీఓ జయచంద్రారెడ్డి
చేగుంట(తూప్రాన్): రేల్వేగేటు వద్ద ఆర్వోబీ నిర్మాణ పనులు ప్రారంభిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు దారి మళ్లింపు కోసం ఆయా గ్రామాల ప్రజలు, నాయకులు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. సోమవారం వడియారంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వడియారం శివారులోని అండర్ బ్రిడ్జి నుంచి మె దక్ రోడ్డు పోలీస్స్టేషన్ వరకు ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇతర భారీ వాహనాలకు నార్సింగి మీదుగా శంకరంపేటకు వెళ్లే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద పెద్ద కంటైనర్లు నర్సాపూర్ మీదుగా మెదక్ వైపునకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరి సహకారం ఉంటేనే ఆర్వోబీ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం వడియారం శివారులోని అండర్ బ్రిడ్జిని అధికారులు పరిశీలించారు. తూప్రాన్ డీఎస్పీ నరేందర్గౌడ్, సీఐ వెంకటరాజాగౌడ్, ఎస్ఐ చైతన్యకుమార్రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ వేణు, రైల్వే ఇంజినీర్లు సమీర్కుమార్, జగదీశ్బాబు, సర్పంచ్లు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.


