మొక్క.. ఏదీ నీ లెక్క!
● మొక్కలు నాటి సంరక్షణ మరిచారు
● ఎండిపోయిన వైనం
● నెరవేరని వనమహోత్సవ లక్ష్యం
నర్సాపూర్: వన మహోత్సవంలో నాటిన మొక్కల సంరక్షణను అధికారులు గాలికొదిలేశారు. దీంతో అవి కర్రలుగా మారి దర్శనమిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వంద రోజుల ప్రణాళికలో భాగంగా స్థానిక అధికారులు పలు కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో వనమహోత్సవంలో మున్సిపల్ కమిషనర్ శ్రీరాంచరణ్రెడ్డి, ఇతర అధికారులతో పాటు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. దాదాపు ఐదు వందల మొక్కలు నాటా మని అధికారులు ప్రకటించారు. కాగా అధికారులు వాటి సంరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. దీంతో చాలా మొక్కలు ఎండిపోయి గోతులు మిగిలాయి. కాగా కొన్ని మొక్కలు ఎండిపోయి ఆకులు లేకపోవడంతో కర్రలుగా మారాయి. మరి కొన్ని మొక్కలు నాటకపోవడంతో పాలిథిన్ కవర్లలోనే ఎండిపోయాయి. ఈ విషయమై ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శేషాచారిని వివరణ కోరగా... తాము మొక్కలు నాటిన ప్రాంతంలో మట్టి బాగా లేదని చెప్పారు. మొక్కలు కర్రలుగా మారిన మాట వాస్తవమని, వాటికి నీరు పెట్టి కాపా డేందుకు త్వరలో చర్యలు తీసుకుంటామని, విద్యార్థులకు మొక్కలను దత్తతకు ఇస్తామని చెప్పారు.
మొక్క.. ఏదీ నీ లెక్క!


