
‘భూ భారతి’తో సమస్యలు పరిష్కారం
తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): రైతుల భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతిని అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. గురువారం తూప్రాన్, మనోహరాబాద్లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ యాజమాన్య హక్కులతో పాటు ఆర్ఓఆర్ చట్టం ప్రకారం అనేక అంశాలను పటిష్టంగా పొందుపరిచిందన్నారు. ధర ణిలో వచ్చిన సమస్యలను గుర్తించి భూ భారతిలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చేయడమే ముఖ్య ఉద్దేశం అని స్పష్టం చేశారు. అనంతరం రైతులతో నేరుగా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భూ భారతిలో ప్రతి రిజిస్ట్రేషన్ పారదర్శకంగా ఉంటుంద న్నారు. రైతులకు భూధార్ కార్డు అందజేయనున్నట్లు తెలిపారు. ధరణిలో చిన్న చిన్న మార్పులతో పాటు ప్రతిది కలెక్టర్ చూసే పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. సాదాబైనామా కోసం దరఖాస్తు చేసుకొని పెండింగ్లో ఉన్నవాటిని సైతం పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నూతన చట్టంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. కాగా గత నాలుగు నెలలుగా తమకు వేతనాలు రావడం లేదని పంచాయతీ కార్మికులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సమావేశంలో ఆర్డీఓ జయచంద్రారెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి, రైతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మనోహరాబాద్ మండల పరిధిలోని కూచారం కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. జిల్లావ్యాప్తంగా 105 తదితర గురుకులాల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేలా బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని తెలిపారు.
కలెక్టర్ రాహుల్రాజ్