సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ప్రత్యేక సమగ్ర పరిశీలనలో అనామలీస్ ఓటర్లకు నోటీసుల జారీ, పరిశీలనలో తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో 1,36,985 మంది ఓటర్ల వివరాలు సరిగా లేవు. ఇందుకోసం ఆన్లైన్లో అప్లోడ్ చేసే క్రమంలో యాప్ తీసుకోవడం లేదు. దీంతో నోటీసులు అందుకున్న ఓటర్లందరూ తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది. చాలామంది ఓటర్లు తమకు వీలుపడక స్పందించడం లేదు. జిల్లా నుంచి విద్య, ఉద్యోగ, ఉపాధి తదితర కారణాలతో వేర్వేరు చోట్లకు వలస వెళ్లారు. అయినా చాలామంది ఓటు హక్కు స్థానికంగానే కొనసాగుతోంది. ఓటరు పరిశీలనలో వేలాది మందికి నోటీసులు ఇవ్వాల్సి వచ్చింది. మ్యాపింగ్ సమయంలో పేరు, తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్, వయస్సు, లింగం తదితర తప్పిదాలు దొర్లాయి. వీరందరికీ మరోసారి పరిశీలన చేసి సరైన రుజువు చూపిస్తే తుది జాబితాలో చోటు దక్కనుంది. చాలామంది ఓటర్లకు నోటీసులు అందుతున్నా బీఎల్వోలు, అధికారుల ముందు హియరింగ్ కోసం నిర్ణీత సమయంలో రావడం లేదు. దీంతో జాప్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్నికల కమిషన్ తుది జాబితా ప్రచురణకు అక్టోబర్ 15నుంచి నవంబర్ 9వరకు గడువు పొడగించింది. నవంబర్ 5వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులను పరిష్కరించాల్సి ఉంది. ఈ క్రమంలో జిల్లాలో వేలాది మంది ఓటర్ల జాబితా పరిశీలనలో బీఎల్వోల నుంచి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులు నిమగ్నమయ్యారు. ఓటర్లకు నోటీసులు అందే వారి వివరాలను సైతం ముఖ్య ఎన్నికల అధికారి(సీఈవో) తెలంగాణ వెబ్సైట్లోనూ అందుబాటులో ఉంచింది.
నోటీసులు.. పరిశీలనలు
09ఎంసీఎల్01, నోటీసులకు ఓటర్లు జత చేసిన ధ్రువపత్రాలను పరిశీలిస్తున్న ఎన్నికల సిబ్బంది


