వెయ్యి రోజులైనా హామీలు నెరవేరలేదు..
ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతాం
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
చెన్నూర్: ముఖ్యమంత్రి, మంత్రులు ధనార్జేనే ధ్యేయంగా పని చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు, 420 హామీలు, ఆరు డిక్లరేషన్లను 100 రోజుల్లో నెరవేరుస్తామని మోసాపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ రాష్ట్రంలో 1.24 కోట్ల వ్యవసాయ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు 4 వేల ఎకరాలు నిషేధిత జాబితాలో చేర్చిన విషయం నిజమా కాదా మంత్రి వివేక్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. పేదల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించే వరకు రైతు పక్షాన తహసీల్, కలెక్టరేట్ల ఎదుట ఆందోళన చేపడుతామని తెలిపారు. నిరుద్యోగులకు 45 వేల ఉద్యోగాలు ఇప్పిస్తానని, పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మంత్రి పేదల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని అన్నారు. ఒక్క చెన్నూర్ మండలంలోనే 740 సర్వేనంబర్లను నిషేధిత జాబితాలో చేర్చడం దారుణమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు భూముల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. మంత్రి పీఏ రమణారావు ఇసుక మాఫీయా నడిపిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దామోదర్రెడ్డి, మందమర్రి నాయకులు సంపత్, బాపురెడ్డి, మానిశెట్టి శ్రీనివాస్, మోతె తిరుపతి, మంత్రి బాపు, జోడు శంకర్, అనిల్, తుమ్మ రమేశ్, కొప్పుల రవీందర్ పాల్గొన్నారు.


