పాతమంచిర్యాల: మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులను వ్యాపారులను చేయడమే ల క్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా వారికి ధాన్యం మిల్లింగ్ బాధ్యతలు అప్పగించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి ఇటీవలే ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వం స్త్రీనిధి, బ్యాంక్ లింకేజీ ద్వారా జీవనోపాధికి వడ్డీ లేని రుణాలు అందించి మహిళల ఆర్థికాభివృద్ధికి సహకారమందిస్తోంది.
మహిళల ఆర్థికాభివృద్ధికే..
ఆర్టీసీతో వ్యాపార భాగస్వామ్యం కోసం మహిళా సంఘాలతో అద్దె బస్సులు నడిపిస్తోంది. జిల్లాలో 16 మండల సమాఖ్యలకు బస్సులు మంజూరు కాగా, రాష్ట్రంలోని ఆయా డిపోల్లో అవి నడుస్తున్నాయి. ఒక్కో బస్కు నెల అద్దె రూ.60వేలు మహిళా సంఘాల ఖాతాల్లో జమవుతున్నాయి. సోలార్ ప్లాంట్ ద్వారా వచ్చిన ఆదాయం కూడా మహిళా సంఘాల ఖాతాలకే చేరుతోంది. 2025–26 వానాకాలం సీజన్లో మహిళా సంఘాలు 150 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించి రూ.3.20 కోట్ల లాభం గడించాయి. అలాగే, జిల్లాకు రెండు పెట్రోల్ బంక్లు మంజూరు కాగా, ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. మహిళా సంఘాల సభ్యులకు ధాన్యం మిల్లింగ్ బాచ్యతలు అప్పగిస్తే అదనపు ఆదాయం సమకూరే అవకాశముంది. ధాన్యం మిల్లింగ్ కోసం రైస్ మిల్లర్లకు ధాన్యాన్ని అప్పగిస్తే సరైన సమయంలో బియ్యం గోదాంలకు చేర్చకుండా ఉండడం, ఏటా మిల్లర్లు బియ్యం కొరత చూపించడం లాంటి సమస్యలు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘాలకు ధాన్యం మిల్లింగ్ బాధ్యతలు అప్పగించేందుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో ఇప్పటికే మహిళా సంఘాలకు రెండు సోలార్ ప్లాంట్లు, 16 బస్సులు మంజూరు చేయగా, 150 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల బాధ్యతలు అప్పగించింది.
జిల్లాలో ఎస్హెచ్జీలు 459
గ్రామైక్య సంఘాలు 10,945
సంఘాల్లోని సభ్యులు 1,11,665
ఇంకా విధివిధానాలు
ఖరారు కాలేదు
ధాన్యం మిల్లింగ్ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వ ప్రతిపాదించింది. సీఎం రేవంత్రెడ్డి అధికారుల సమావేశంలోనూ ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు అధికారికంగా ఉన్నతాధికారులు, ప్రభుత్వం నుంచి ఎలాంటి సర్క్యులర్ విడుదల కాలేదు. – ఎస్.కిషన్, డీఆర్డీవో


