మంచిర్యాలఅర్బన్: పేద విద్యార్థులు విద్య కోసం ఆశ్రయం పొందుతున్న సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో పర్యవేక్షణ కొరవడింది. గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. అదనపు కలెక్టర్, జిల్లా ఉన్నతాధికారులు ప్రతీ పదిహేను రోజులకోసారి ఏదో వసతిగృహాన్ని సందర్శించి రాత్రి బస చేయాల్సి ఉంది. విద్యార్థులు తమ సమస్యలు, ఆహారం, వసతులు, వేధింపులు వంటి వాటిపై నేరుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభిస్తుంది. రాత్రివేళల్లో తనిఖీల వల్ల నిర్వాహకుల్లో జవాబుదారీతనం పెరిగి మెనూ పక్కాగా అమలవుతుంది. కానీ అధికారులు రాత్రి బస చేయకపోవడం వల్ల డైట్ మెనూ సక్రమంగా అమలు కాకపోవడం, సరైన పరిశుభ్రత లేక విద్యార్థులు తరచూ అస్వస్థతకు గురవుతున్నారు. విద్యార్థులు పారిపోయిన ఘటనల నేపథ్యంలో భద్రతపై తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. కొన్నిచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరడం, ఇతరత్రా సమస్యలు నెలకొన్నాయి. గురుకులాలు, వసతిగృహాల్లో రాత్రి బస చేయడం ద్వారా సమస్యల పరిష్కారంతోపాటు విద్యార్థులు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అభద్రతాభావం తొలగిపోతుంది. పరిసరాల పరిశుభ్రత, మెనూ పక్కాగా అమలయ్యే అవకాశం ఉంటుంది.
వరుస ఘటనలతో కలవరం
సంక్షేమ గురుకులాలు, వసతిగృహాల్లో నిరంతర తనిఖీలు లేకపోవడంతో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అల్పాహారం, భోజనం ఎలా అమలవుతుందో తెలియకుండా పోతోంది. మెనూ అమలుపై విద్యార్థులు ఆందోళనబాట పడుతున్నారు. బదిలీల ప్రక్రియ ముగియగానే వార్డెన్ల మధ్య కోల్డ్వార్ నడుస్తోంది. బదిలీపై వచ్చిన వార్డెన్లపై ఒత్తిడి పెంచి వెళ్లిపోయేలా.. మరోచోట వార్డెన్ను తొలగించేలా పావులు కదిపినట్లు తెలుస్తోంది. విద్యార్థులు హాస్టల్ నుంచి పారిపోవడం, ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురైన సంఘటనలు కలవరపెడుతున్నాయి.
గురుకులాల వసతిగృహాలు సంఖ్య విద్యార్థులు
మైనార్టీ 04 1,114
ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ 08 4,010
సోషల్ వెల్ఫేర్ 09 5,017
ఎస్సీ వసతిగృహాలు 25 2,282
బీసీ వసతిగృహాలు 18 1,420
కేజీబీవీ 18 5,850
ఎస్టీ వసతి, ఆశ్రమ పాఠశాలలు 16 2,600
మోడల్స్కూళ్ల హాస్టళ్లు 04 400


