మంచిర్యాలటౌన్: జిల్లా కేంద్రమైన మంచిర్యాల నగరంలో అభివృద్ధి పనులకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. రోడ్డు నిర్మాణ స్థలాలపై ఏళ్ల తరబడి కోర్టు కేసుల కారణంగా పనులు నిలిచిపోతున్నాయి. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరైనా కేసులతో పనులు నిలిపివేయాల్సి వస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్గా మారడం, జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల ప్రజలు, వాహనాల రద్దీకి అనుగుణంగా రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
● రాళ్లవాగుపై గతంలో నిర్మించిన కాజ్వే ప్రతియేటా భారీ వర్షాలకు కొట్టుకుపోవడం, వర్షాకాలం తర్వాత మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించడం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం రూ.13.50కోట్లతో కాజ్వే స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణానికి మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శంకుస్థాపన చేయగా.. పనుల ప్రారంభంలో ఆలస్యమైంది. అనంతర పరిణామాల్లో రంగంపేట్ వైపు ఐటీ హబ్, ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో లక్ష్మి టాకీస్ నుంచి రంగంపేట్ వరకు రాళ్లవాగు కాజ్వే మీదుగా ఆరు వరుసల రోడ్డు ఏర్పాటుకు రూ.195కోట్లు కేటాయించి బ్రిడ్జి పనులు ప్రారంభించారు. స్థానికంగా ఉండే సన్సిటీ కాలనీవాసులు ఆరు వరుసలతో బ్రిడ్జి, రోడ్డు వద్దని ఆందోళనకు దిగుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. బ్రిడ్జి పూర్తయితే పవర్సిటీ, సన్సిటీ, రంగంపేట్, పాతమంచిర్యాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది.


