వాంకిడి: కుల పెద్దల మాటలు విననడం లేదని ఓ కుటుంబాన్ని ఏడేళ్లుగా కుల బహిష్కరణనకు గురిచేస్తున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొదురుపాక శంకర్, కళావతి దంపతుల ఏకై క కూతురు లావణ్యకు కన్నెపల్లి మండలానికి చెందిన రామగిరి పెంటేష్తో వివాహం జరిపించారు. అల్లుడిని ఇల్లరికం తీసుకొచ్చి మండల కేంద్రంలోనే కటింగ్ షాప్ పెట్టించారు. దీంతో స్థానిక మంగళి కుల పెద్దలు షాపులో రెండు కుర్చీలు మాత్రమే పెట్టుకోవాలని నిబంధనలు విధించారు. దీనికి అంగీకరించకపోవడంతో ఆ కుటుంబాన్ని బహిష్కరించారు. తీవ్ర ఆవేదనకు గురైన బాధితులు బుధవారం విలేకరులతో గోడు వెల్లబోసుకున్నారు. కటింగ్ షాపుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నామని అధికారులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు.


