ఏసీబీ వలలో నస్పూర్‌ ఎస్సై | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో నస్పూర్‌ ఎస్సై

Apr 19 2025 9:38 AM | Updated on Apr 19 2025 9:38 AM

ఏసీబీ వలలో నస్పూర్‌ ఎస్సై

ఏసీబీ వలలో నస్పూర్‌ ఎస్సై

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/నస్పూర్‌: క్షుద్ర పూజల కేసులో జప్తు చేసిన నగదును బాధితుడికి ఇవ్వక సొంతానికి వాడుకున్న ఎస్సై అవినీతి నిరోధక శాఖకు చిక్కి జైలు పాలయ్యాడు. ఆదిలాబాద్‌ రేంజీ డీఎస్పీ పి.విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ ఎస్సై నెల్కి సుగుణాకర్‌ గత జనవరి 26న క్షుద్రపూజలతో రెట్టింపు డబ్బులు చేస్తానని మహారాష్ట్రకు చెందిన ఓ పూజరి మోసం కేసులో రూ.2లక్షలు జప్తు చేశాడు. కేసు ఫిర్యాదుదారుడు ప్రభంజన్‌ కోర్టు నుంచి నగదు విడుదల కోసం ఈ నెల 4న ఉత్తర్వులు తీసుకు రాగా, ఇచ్చేందుకు ఎస్సై దాట వేశాడు. రూ.1.50లక్షలు బాధితుడి చేతిలో పెడుతూ ఫొటో దిగి, వెంటనే డ్రాలో వేసుకున్నాడు. రూ.2లక్షలు తీసుకున్నట్లు సంతకం చేయమని ఒత్తిడి చేయగా బాధితుడు ఒప్పుకోలేదు. ఈ నెల 8న మళ్లీ స్టేషన్‌కు వెళ్లి ఎస్సైని అడిగితే, డబ్బులు ఖర్చయ్యాయని, రూ.50వేలు ఉన్నాయని, నీ మీద కూడా కేసు అయ్యేది ఇచ్చింది తీసుకో అంటూ బెదిరించి పంపేశాడు. ఈ నెల 10న రూ.70వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్నాక ఇవ్వలేదు. చివరకు రూ.50వేలకు మరో పది వేలు కలిపి ఓ వైన్స్‌ వద్ద తీసుకోవాలని చెప్పాడు. ఇదే కేసులో బాధితుడి పేరు లేకుండా ఉండేందుకు ఎస్సై బినామీ డి.దీపక్‌కు ఫోన్‌ పేలో రూ.30వేలు చెల్లించాడు. విసిగెత్తిన బాధితుడు ఏసీబీ టోల్‌ ఫ్రీ 1064ను సంప్రదించగా, ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్సై ఫోన్‌లో మాట్లాడిన ఆడియో రికార్డులు, ఫోన్‌ పే చెల్లింపు, జప్తు చేసిన నగదు లేకపోవడం ఆధారాలు సేకరించారు. ఎఫ్‌ఐఆర్‌ చేసి ఎస్సైని కరీంనగర్‌ ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెట్టగా రిమాండ్‌ విధించారు. 2020బ్యాచ్‌కు చెందిన ఎస్సై గతేడు జూలై నుంచి నస్పూర్‌ ఎస్సైగా పని చేస్తున్నారు.

క్షుద్రపూజల కేసులో నగదు జప్తు

బాధితుడికి ఇవ్వకుండా ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement